యాసిడ్ దాడి.. ఆ పై ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

యాసిడ్ దాడి.. ఆ పై ఆత్మహత్య

Published Fri, May 22 2015 3:36 PM

యాసిడ్  దాడి.. ఆ పై ఆత్మహత్య - Sakshi

భోపాల్: యాసిడ్ అమ్మకాలపై నిషేధం విధించినా, మహిళల మీద యాసిడ్ దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా భోపాల్లో మరో యాసిడ్ దాడి జరిగింది. బాధితురాలు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. చాలాకాలంగా వెంటపడుతూ, వేధిస్తున్న 40 ఏళ్ల  సంజయ్ పాటిల్   చివరకు ఆ అమ్మాయిపై యాసిడ్ దాడి చేసి,  తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన  స్థానికంగా కలకలం రేపింది.  

ఎస్పీ అరవింద్ సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం 22 ఏళ్ల రేణు స్థానికంగా జిమ్ ట్రైనర్ పని చేస్తోంది. ఉదయాన్నే స్కూటీపై వెళ్తుండగా కొద్ది దూరం  ఆమె వాహనాన్ని ఫాలో అయ్యాడు. సడన్గా ఆమెను అడ్డగించి  యాసిడ్ దాడి చేశాడు. ఆ తర్వాత తనను తాను కత్తితో పొడుచుకుని, అక్కడిక్కడే చనిపోయాడు. రేణు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

కాగా పొద్దున్నే జిమ్కు వెళ్తుండగా అతను తన మీద దాడి చేసి యాసిడ్ పోశాడని బాధితురాలు వాపోతోంది. అతను చాలాకాలంగా  తనను వేధిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తోంది.

అతడు కొన్ని రోజులుగా  తమ   కూతుర్ని వేధిస్తున్నాడని, ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేశాడని రేణు తల్లి మమతా సాహు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ పాటిల్ పై ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement