50:50 కి ఒప్పుకోవాల్సిందే.. | Sakshi
Sakshi News home page

50:50 కి ఒప్పుకోవాల్సిందే..

Published Sat, Sep 20 2014 11:54 PM

Maharashtra Assembly polls: NCP, Congress trade ultimatums

ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 50 శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌కు జాతీయ కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం జారీచేసింది. ఆ పార్టీ నాయకుడు ప్రఫుల్ పటేల్ శనివారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ తమకు కేటాయిస్తామంటున్న 124 సీట్లకు ఒప్పుకోమన్నారు. 288 సీట్లకు గాను తమకు 144 స్థానాలు కేటాయించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ‘మాకు 124 స్థానాలే ఇస్తామని కాంగ్రెస్ అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాకు 50 శాతం సీట్లు కేటాయించాల్సిందేనని మేం ఇప్పటికే చాలాసార్లు చెప్పాం..’ అని పటేల్ అన్నారు.

‘ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఆ పార్టీ ప్రతిస్పందన కోసం మేం మరో రోజు ఎదురుచూస్తాం.. తర్వాత ఏంచేయాలనేది నిర్ణయించుకుంటా’మని చెప్పారు. తాము ఇప్పటికీ కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన సీట్ల నేపథ్యంలోనే ప్రస్తుతం తాము సగం సీట్లు అడుగుతున్నామని ఆయన నొక్కిచెప్పారు. గతంలో కాంగ్రెస్ కన్నా మేం ఎక్కువ సీట్లు గెలుచుకున్నా సీఎం పదవి వారికే వదిలివేశామనే విషయాన్ని వారు గుర్తుచేసుకోవాలన్నారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి.. అందుకే మేం 144 స్థానాలు కోరుతున్నాం.. ఇదేం కొత్త డిమాండ్ కాదు కదా..’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement