
లోక్సభలో శుక్రవారం కోరం లేక కార్యక్రమాలు నిలిచిపోయాయి.
న్యూఢిల్లీ: లోక్సభలో శుక్రవారం కోరం లేక కార్యక్రమాలు నిలిచిపోయాయి. పదిహేను రోజులుగా సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం సభలో చాలినంత సంఖ్యా బలం లేకపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. సాయంత్రం 5.45 గంటల సమయంలో సభలో కెన్–బెట్వా అనుసంధానం, నీటి ఎద్దడి సమస్యలపై చర్చ జరుగుతుండగా ఆప్ సభ్యుడు భగ్వంత్ మాన్ కోరం లేని విషయాన్ని స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ దృష్టికి తెచ్చారు.
ప్రతిపక్షంతోపాటు అధికార పార్టీల సభ్యులు చాలామంది సభలో లేకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అగర్వాల్ సభా కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు కోరం బెల్ మోగించారు. మొత్తం సభ్యుల్లో కనీసం 10 శాతం, అంటే కనీసం 55 మంది సభ్యులుంటే కోరం ఉన్నట్లు లెక్క.