51 మంది మహిళల లిస్ట్‌లో పలు తప్పిదాలు

Kerala Government Made Several Mistakes In Sabarimala List - Sakshi

శబరిమల : నేను మగాడినండి బాబు.. అంటూ రిపోర్టర్ల ముందు మొరపెట్టుకుంటున్నాడు తమిళనాడుకు చెందిన 47 ఏళ్ల పరంజ్యోతి. పాపం ఈ పేరే అతన్నిప్పుడు ఇబ్బందుల్లో పడేసింది. విషయం ఏంటంటే.. శుక్రవారం కేరళ ప్రభుత్వం 51 మంది.. 50 ఏళ్ల లోపు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారంటూ సుప్రీం కోర్టుకు నివేదిక అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో కొందరు మగవారి పేర్లను కూడా చేర్చడంతో ప్రస్తతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. పాపం ఈ లిస్ట్‌లో పరంజ్యోతి పేరు కూడా వుంది. దాంతో నేను మగాడినండి బాబు అంటూ రిపోర్టర్ల ముందు వాపోతున్నాడు పరంజ్యోతి.

పాండిచ్చేరికి చెందిన శంకర్‌ పరిస్థితి మరి దారుణం. ఆలయంలోకి ప్రవేశించిన 51 మంది మహిళల పేర్లలో ‘కళావతి’ అనే ఆమె ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ‘కళావతి’ పేరు పక్కన ట్యాక్సీ డ్రైవర్‌ శంకర్‌ ఫోన్‌ నంబర్‌ను రాశారు. దాంతో గత రెండు రోజులుగా అతని ఫోన్‌ నిరంతరాయంగా మొగుతూనే ఉందంట.

తమిళనాడుకు చెందిన గృహిణి షీలాది మరోక కథ. ఆమె వయసు 52 సంవత్సరాలు. కానీ కోర్టుకిచ్చిన లిస్ట్‌లో షీలా పేరు కూడా ఉంది. షీలాతో పాటు మరి కొంతమంది మహిళలు లిస్ట్‌లో తమ పేర్లు కూడా ఉన్నాయంటూ మీడియా ముందుకు వచ్చారు. తమ వయసు 50 సంవత్సరాలకు పైనే అని .. కానీ కోర్టుకిచ్చిన లిస్ట్‌లో తమ పేర్లు చేర్చారని సదరు మహిళలు తెలిపారు.

అయితే లిస్ట్‌లో జరిగిన అవకతవకల గురించి కాంగ్రెస్‌ నాయకులు మండి పడుతున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు. తప్పుడు సమాచారంతో కేరళ ముఖ్యమంత్రి సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top