
గౌరీ హత్యపై రాజకీయం
కర్ణాటకలో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకేసుపై రాజకీయ వేడి రాజుకుంది.
రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ
► లంకేశ్కు సిద్ధరామయ్య భద్రత కల్పించలేదని విమర్శ
► నిందితుల ఆచూకీపై రూ. 10 లక్షల రివార్డు
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకేసుపై రాజకీయ వేడి రాజుకుంది. హత్యకు బీజేపీ, ఆరెస్సెస్లే కారణమంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కేసు విచారణలో ముందడుగు పడకుండా అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించింది. నక్సలైట్ల నుంచి ముప్పుందని గౌరీ సోదరుడు చెప్పినా.. భద్రత ఇవ్వటంలో కర్ణాటక సర్కారు విఫలమైందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. కాగా, గౌరీ హంతకుల ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
నిష్పాక్షిక విచారణ సాధ్యమేనా?: గౌరీ హత్య దురదృష్టకరమని అయితే.. పూర్తి విచారణ జరగకుండానే అనుచిత విమర్శలు చేయటం సరికాదని రవిశంకర్ అన్నారు. మావోలను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. వారి నుంచి గౌరీకి హెచ్చరికలు వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ‘నక్సలైట్లను సరెండర్ చేసేందుకు ఆమె ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారా? ఇది నిజమే అయితే.. ఆమెకు భద్రత ఎందుకు కల్పించలేదు’ అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.
ఈ ఘటనపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిష్పాక్షిక విచారణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. శాంతిభద్రతల వైఫల్యంపై ఆ పార్టీ సీఎంను అడగాలని సూచించారు. గౌరీకి భద్రత కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న రవిశంకర్ వ్యాఖ్యలను కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి ఖండించారు. గౌరీ హత్యను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఖండించారు. ‘ఇలాంటి ఘటనకు భారత్లో జరగొద్దు. ఇది నా భారతం కాదు’ అన్నారు.