సుర్రుమన్న ఛురు | Country battles heatwave conditions, temperature nears 51°C in Rajasthan | Sakshi
Sakshi News home page

సుర్రుమన్న ఛురు

Jun 2 2019 4:45 AM | Updated on Jun 2 2019 11:39 AM

Country battles heatwave conditions, temperature nears 51°C in Rajasthan - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌పై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో శనివారం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్తాన్‌లోని ఛురు ప్రాంతంలో ఏకంగా 50.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే వారం రోజులవరకూ దేశమంతటా ఇదేతరహా వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీలో 46.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు పాలమ్‌ అబ్జర్వేటరీ తెలిపగా, 46.1 డిగ్రీలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఢిల్లీలో ఎండ తీవ్రతను సూచించే రెడ్‌ కేటగిరి హెచ్చరికను ఐఎండీ జారీచేసింది. రాజస్తాన్‌లోని గంగానగర్‌లో 49 డిగ్రీలు, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా బందాలో 48.4 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయింది. రాబోయే ఐదు రోజులు మధ్యప్రదేశ్, రాజస్తాన్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

హరియాణాలోని నర్నౌల్‌లో 47.2 డిగ్రీలు,పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 45.7 డిగ్రీలు, లూథియానాలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చల్లగా ఉండే హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉనాలో శనివారం 44.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక జమ్మూకశ్మీర్‌లోని జమ్మూలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్ర, హిమాచల్, తూర్పు మధ్యప్రదేశ్‌ ఉత్తర కర్ణాటకలోని కొన్నిప్రాంతాల్లో  సాధారణం కంటే 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైనట్లు వెల్లడించింది. రాయలసీమ, కేరళ, విదర్భ, హరియాణాలోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3–5 డిగ్రీలు అధికంగా రికార్డైనట్లు పేర్కొంది. ఒడిశాలోని దక్షిణ భాగంలో అధికతేమ కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement