రోడ్డుపై అప‌స్మార‌క స్థితిలో పారామెడిక‌ల్ సిబ్బంది

Corona Warrior Lying Unconscious On Road In Madhya Pradesh - Sakshi

భోపాల్‌: క‌రోనా వారియర్‌ స్పృహ తప్పి ప‌డిపోతే ఏ ఒక్క‌రూ చ‌లించ‌లేదు. అరగంట‌కు పైగా రోడ్డు మీద ప‌డి ఉన్న స‌ద‌రు పారామెడిక‌ల్ సిబ్బందికి స‌హాయం చేసేందుకు ఏ ఒక్క‌రూ ముందుకు రాలేదు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. పీపీఈ కిట్లు ధ‌రించిన‌ పారామెడిక‌ల్ సిబ్బంది క‌రోనా రోగుల‌ను చికిత్స నిమిత్తం జిల్లాలోని టీవీ ఆస్ప‌త్రి నుంచి బుందేల్‌ఖండ్ మెడిక‌ల్ కాలేజీకి త‌ర‌లించారు. అనంత‌రం తిరిగి ఆస్ప‌త్రికి బ‌య‌లు దేరారు. (ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..)

ఈ క్ర‌మంలో వారిలో ఓ వ్య‌క్తి ఉన్న‌ప‌ళంగా రోడ్డుపై ప‌డిపోయాడు. ఈ క్ర‌మంలో అత‌నికి ర‌క్ష‌ణగా నిల‌వాల్సిన సహోద్యోగులు అత‌డిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో అత‌ను 25 నిమిషాల పాటు రోడ్డుపై అచేత‌నంగా ప‌డిపోయి ఉన్నాడు. రోడ్డు వెంట వెళుతున్న వారు కూడా చూస్తూ వెళ్లిపోయారే త‌ప్పితే సాయం చేసేందుకు ముందడుగు వేయ‌లేదు. స‌ద‌రు విష‌యం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని అత‌డిని జిల్లా ఆసుప‌త్రిలో చేర్పించింది. అయితే అత‌ను అప‌స్మారక స్థితిలోకి వెళ్ల‌డానికి గ‌ల కార‌ణాలు తెలియరాలేదు. (చచ్చిపడిన గబ్బిలాలు.. స్థానికుల్లో ఆందోళన!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top