మరికొన్ని గంటల్లో పెళ్లి.. ప్రియుడితో వధువు జంప్‌!

Bride escape before hours of marriage in karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు : మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి రాత్రికి రాత్రే ప్రియుడితో కలసి పరారైన ఘటన ఆదివారం మంగళూరు నగరంలో వెలుగు చూసింది. మంగళూరు నగరంలోని మూడబిద్రికి చెందిన ప్రియాంక(25) చిన్న వయసులోనే తండ్రి మృతి చెందడంతో ఆమెను తల్లి ఎంతో గారాబంగా పెంచారు. ఉన్నత చదువులు చదివిన ప్రియాంకకు ఆమె తల్లి, బంధువులు ఇటీవల విదేశాల్లో ఉద్యోగంలో స్థిరపడ్డ యువకుడితో నిశ్చితార్థం జరిపించారు.

ఈ క్రమంలో సోమవారం ఇరువురికి వివాహం జరగాల్సి ఉండగా అందుకు సంబంధించి శుక్రవారం రాత్రి ప్రియాంక ఇంట్లో మెహందీ కార్యక్రమం కూడా నిర్వహించారు. మెహందీలో కూడా ప్రియాంక ఎవరికీ అనుమానం కలుగకుండా అందరితో ఉల్లాసంగా గడిపింది. రాత్రికి రాత్రి ఇంట్లో నగలు, పాస్‌పోర్ట్, ఆధార్‌కార్డులను తీసుకొని ప్రియుడితో కలసి పారిపోయింది. ఆదివారం ఉదయం ప్రియాంక ఎంతకి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లి, బంధువులు ఇళ్లంతా గాలించగా ఇంట్లో దాచిన ఆభరణాలతో పాటు ప్రియాంక పాస్‌పోర్ట్, ఆధార్‌కార్డు కనిపించకపోవడంతో మూడిబిద్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు.

లవ్‌జిహాద్‌గా అనుమానం...
కాగా ప్రియుడితో కలసి ప్రియాంక పారిపోయిన ఘటన లవ్‌జిహాద్‌ అయి ఉండొచ్చంటూ ఆమె తల్లి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది కాలం నుంచి ప్రియాంక ఫరంగిపేటకు చెందిన హైదర్‌ అనే వ్యక్తితో తరచూ మాట్లాడుతుండేదని తెలిపారు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ప్రియాంకను హైదర్‌ తనతో పాటు తీసుకెళ్లి ఉండాడంటూ అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల కార్యకర్తలు ఇది ముమ్మాటికి లవ్‌ జిహాదేనంటూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసనలు చేసారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top