రేపు ట్రూడోతో అమరీందర్‌ భేటీ | Amarinder meeting tomorrow with Trudo | Sakshi
Sakshi News home page

రేపు ట్రూడోతో అమరీందర్‌ భేటీ

Feb 20 2018 12:58 AM | Updated on Feb 20 2018 12:58 AM

Amarinder meeting tomorrow with  Trudo - Sakshi

చండీగఢ్‌/అహ్మదాబాద్‌/గాంధీనగర్‌: పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోతో బుధవారం భేటీ కానున్నారు. ట్రూడోకు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలకాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ‘ట్రూడోతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నా. ఈ భేటీతో భారత్‌–కెనడా వ్యాపార సంబంధాలు పటిష్టం కావడంతో పాటు ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నా’ అని అమరీందర్‌ ట్వీట్‌ చేశారు.

కెనడాలో పెద్దఎత్తున స్థిరపడ్డ పంజాబీలు ఇరుదేశాల మధ్య సత్సంబంధాల పటిష్టానికి ఎంతో కృషి చేశారన్నారు.  స్వర్ణ మందిరాన్ని సందర్శించుకున్న అనంతరం ట్రూడో అమరీందర్‌తో భేటీ కానున్నారు. గతంలో పంజాబ్‌కు వచ్చిన కెనడా రక్షణమంత్రి హర్జిత్‌ సజ్జన్‌ను ఖలిస్తాన్‌ సానుభూతిపరుడిగా అభివర్ణించిన అమరీందర్, ఆయన్ను కలుసుకోవడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. 2016లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కెనడాలోని పంజాబీ ఎన్నారైలను కలుసుకునేందుకు కెనడా అనుమతించకపోవడంపై అమరీందర్‌ ట్రూడోకు ఘాటుగా లేఖ రాశారు.  

మహిళలకు అవకాశం కల్పించట్లేదు: ట్రూడో
మహిళలు పూర్తిస్థాయిలో తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకునేందుకు వీలుగా సమాజం తగిన అవకాశాలు కల్పించడం లేదని ట్రూడో అభిప్రాయపడ్డారు. 50 శాతం జనాభా(మహిళల) భాగస్వామ్యం లేకుండా సమాజం, ఆర్థికవ్యవస్థ అభివృద్ది చెందడం సాధ్యంకాదని తేల్చిచెప్పారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) అహ్మదాబాద్‌ విద్యార్థులతో సోమవారం నాడిక్కడ సమావేశమైన ఆయన, పలు అంశాలపై మాట్లాడారు. ‘21వ శతాబ్దం వేర్వేరుజాతులు కలసిమెలసి జీవించే సమాజానిదే.

ఈ వైరుధ్యాలను బలంగా ఎలా మార్చుకుంటామన్నదే  సమాజం ముందున్న సవాలు. విభిన్న సంస్కృతులు, జాతులున్న భారత్, కెనడాలు ఈ సమస్యను చక్కగా ఎదుర్కొన్నాయి’ అని ఆయన అన్నారు. కెనడియన్‌ కావాలంటే రంగు, రూపంతో ఎలాంటి పనిలేదనీ, చేసే వృత్తితో పాటు ఫ్యాషన్‌పై మక్కువ ఉంటే చాలని వ్యాఖ్యానించారు. ఈ భేటీకి ముందు ట్రూడో దంపతులు భారతీయ వస్త్రధారణతో సబర్మతీ ఆశ్రమాన్ని, స్వామి నారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం గుజరాత్‌ సీఎంతో భేటీ అయ్యారు.


మోదీపై కెనడా మీడియా ఆగ్రహం
భారత పర్యటనకు వచ్చిన ట్రూడోకు స్వాగతం పలకడానికి ప్రధాని మోదీ విమానాశ్రయానికి వెళ్లకపోవడంపై కెనడా మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలిస్తాన్‌ వేర్పాటువాదులకు ట్రూడో ప్రభుత్వం మద్దతుగా నిలవడమే ఇందుకు కారణమని ఆరోపించింది. ఈ చర్యతో మోదీ ట్రూడోను అవమానించారని మండిపడింది.

మరోవైపు ఈ ఊహాగానాలను భారత అధికారులు ఖండించారు. ట్రూడోను ఆహ్వానించేందుకు ప్రోటోకాల్‌ ప్రకారం కేంద్ర మంత్రి వెళ్లారని గుర్తుచేశారు. సాధారణంగా విదేశీ పర్యటన ప్రారంభంలోనే ఇరుదేశాల అధినేతలు భేటీ అవుతారనీ, కానీ ఈ పర్యటన చివర్లో ప్రధాని మోదీతో ట్రూడో భేటీ అయ్యేలా షెడ్యూల్‌ను కెనడా అధికారులు రూపొందించడం తమకు ఆశ్చర్యం కలిగించిందని వెల్లడించారు. గుజరాత్‌లో ట్రూడోతో మోదీ కలసి పర్యటించేందుకు ముఖ్యమైన అంశాలేవీ లేవని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement