అఖిలేష్ చేతుల్లోనే శివపాల్ తలరాత
శివపాల్ యాదవ్కు మంత్రిపదవి మళ్లీ ఇవ్వాలా.. వద్దా అనే విషయాన్ని అఖిలేష్ యాదవ్కే వదిలిపెడుతున్నానని ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు.
తన తమ్ముడు శివపాల్ యాదవ్కు మంత్రిపదవి మళ్లీ ఇవ్వాలా.. వద్దా అనే విషయాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కే వదిలిపెడుతున్నానని, ఆ విషయంలో అతడే నిర్ణయం తీసుకుంటాడని సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. దాన్ని బట్టి ఆ అంశంపై తాను అంతగా పట్టుబట్టలేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎటూ ఉంది కాబట్టి, మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడే ఈ విషయంలో తొందరపడటం ఎందుకని తమ్ముడికి ఆయన నచ్చజెప్పినట్లు సమాచారం.
ఎటూ రాబోయే ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పాం కాబట్టి.. అప్పుడే కావల్సిన వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవచ్చన్నది ములాయం వ్యూహంలా కనిపిస్తోంది. ఈ రెండు నెలల్లో అనవసరంగా రచ్చ చేసుకుని పార్టీ పరువును రోడ్డున పడేసుకోవడం ఎందుకన్న ఆలోచనతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారని అంటున్నారు. అయితే ములాయం మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శివపాల్ యాదవ్ పాల్గొన్నారు గానీ.. ముఖ్యమంత్రి అఖిలేష్ మాత్రం పాల్గొనలేదు. అలాగే.. శివపాల్ను కేబినెట్లోకి తీసుకోవడం, అమర్సింగ్ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అడగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. తాను చెప్పదలచుకున్నది నర్మగర్భంగా చెప్పి, అంతటితో ప్రెస్మీట్ ముగించి వెళ్లిపోయారు.
ప్రస్తుతం వస్తున్న సర్వే ఫలితాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ సొంతంగా అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే అనుమానంగా కనిపిస్తోంది. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటే తప్ప గట్టెక్కలేని పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల తర్వాతి పరిస్థితి గురించి ఇప్పుడే చెప్పడం ఎందుకన్నది ములాయం అభిప్రాయంలా అనిపిస్తోంది. ప్రస్తుతం చెలరేగిన చిచ్చు ఇటు పార్టీతో పాటు అటు కుటుంబంలో కూడా చెలరేగడంతో.. ముందు దాన్ని చల్లార్చిన తర్వాత ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని అంటున్నారు. రెండోభార్య సాధన కోడలు అపర్ణాయాదవ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించడం లాంటి కారణాల వల్ల అప్పుడే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నది ములాయం వ్యూహమని ఆయన అనుచరులు చెబుతున్నారు.