
మదురైలో ‘మర్డర్లు’!
మదురై నగరంపై తీవ్ర వాదులు గురిపెట్టినట్టు ఇటీవల ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. మీనాక్షి అమ్మవారి ఆలయ పరిసరాల్ని నిఘా నీడలోకి తెచ్చారు.
మదురై నగరంలో 24 గంటల్లో ఐదుగురు హత్యకు గురికావడం అక్కడి ప్రజల్లో భయాందోళన రెకెత్తించింది. మృతుల్లో ఇద్దరు డీఎంకే నాయకులు ఉన్నారు. మరో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ హత్యల పర్వంతో పోలీసు యంత్రాంగం పరుగులు తీసింది. ఐదు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించింది.
సాక్షి, చెన్నై: మదురై నగరంపై తీవ్ర వాదులు గురిపెట్టినట్టు ఇటీవల ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. మీనాక్షి అమ్మవారి ఆలయ పరిసరాల్ని నిఘా నీడలోకి తెచ్చారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయినా నగరంలో సాగుతున్న దోపిడీలు, దొంగ తనాలు, హత్యల పర్వం స్థానికుల్ని భయాందోళనలో పడేస్తున్నాయి. శుక్రవారం 24 గంటల వ్యవధిలో నగరంలో ఐదుగురు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. హత్యల పర్వం: శుక్రవారం వేకువ జామున నగరం పరిధిలోని పుదుమేడు పరిసరాల్లో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఉదయాన్నే వచ్చిన ఫోన్కాల్తో అక్కడికి నగర పోలీసు యంత్రాంగం పరుగులు తీసింది. మృతుడు ఆ ప్రాంతానికి చెందిన డీఎంకే నాయకుడు ముత్తు పాండియన్గా గుర్తించారు.
ఇటీవల కుటుంబ తగాదాలతో ముత్తుపాండియన్ భార్య పూర్ణిమ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు ప్రతీకరంగానే ముత్తుపాండియన్ హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిఆవుండగా తల్లకులంలో మరో హత్యాకాండ చోటుచేసుకుంది. రవికుమార్, రామకృష్ణ, కరుప్పయ్య వ్యాపారులు. అక్కడి ఓ ప్రాంతంలో మాటామంతిలో మునిగి ఉన్నారు. ఆ సమయంలో అటు వైపుగా వచ్చిన ఓ ముఠా వీరంగం సృష్టించింది. కరుప్పయ్యను టార్గెట్చేసి కత్తులు, కొడవళ్లతో నరికి చంపింది. మృతుడు కరుప్పయ్య డీఎంకే స్థానిక నాయకుడు. సమాచారం అందుకున్న నగర పోలీసులు ఉరకలు తీశారు. విచారణలో రియల్ ఎస్టేట్ వ్యవహారం కరుప్పయ్య హత్యకు కారణంగా భావించారు.
ఒకే చోట ముగ్గురు: మదురై పోలీసుల్ని సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరో ఘటన పరుగులు తీయించింది. ఒకే చోట ముగ్గురిని ఓ ముఠా కడతేర్చడం కలకలం రేపింది. మీనాంబికానగర్లో తమ ఇంట్లో టీవీ చూస్తున్న స్నేక్ నాగరాజు, కరుప్పురాజ, మణికార్తిక్ దారుణ హత్యకు గురయ్యారు. టీవీ చూస్తున్న సమయంలో అటువైపుగా పది మందితో కూడిన ఓ ముఠా వారిపై దాడి చేసింది. ఎలాంటి చడీచప్పుడూ లేకుండా ఈ ముగ్గుర్నీ హతమార్చిన ఆ ముఠా నడుచుకుంటూ సాఫీగా ఉడాయించింది.