కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట! | Ram Gopal Varma Tweet Over His Coronavirus Song On Trending | Sakshi
Sakshi News home page

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!

Apr 2 2020 12:38 PM | Updated on Apr 2 2020 1:02 PM

Ram Gopal Varma Tweet Over His Coronavirus Song On Trending - Sakshi

తాను కరోనా వైరస్‌ గురించి రాసి, ఆలపించిన పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచిందని సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ హర్షం వ్యక్తం చేశారు. ‘‘కరోనా నెంబర్‌ 1. కరోనా పాట నెం. 2 ట్రెండింగ్‌లో ఉన్నాయి’’అని ట్విటర్‌లో పేర్కొన్న ఆర్జీవీ.. యూట్యూబ్‌ వీడియోను ఇందుకు జత చేశారు. అదే విధంగా తన పురుగు పాట టాలీవుడ్‌ సెలబ్రిటీల పాట కంటే ఎక్కువ వ్యూస్‌ సంపాదిస్తోంది.. ఎందుకంటారు అంటూ మరో ట్వీట్‌ చేశారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలంటూ.. మహమ్మారి గురించి అవగాహన కల్పిస్తూ ఇదివరకే పలు పాటలు విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆర్జీవీ సైతం తన కలాన్ని బయటకు తీశారు. ‘‘అది ఒక పురుగు. కనిపించని పురుగు. కరోనా అనే పురుగు. నలిపేద్దామంటే అంత సైజు లేదు దానికి. పచ్చడి చేద్దామంటే అంత కండ లేదు దానికి. అదే దాని బలం. అదే దాని దమ్ము’’అంటూ తన స్టైల్లో పాట రాసి.. తానే స్వయంగా పాడారు. ఇక ఈ పాటపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా... గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆర్జీవీపై ఓ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్జీవీ అనే టైటిల్‌..(ఉప శీర్షిక: రోజూ గిల్లే వాడు)తో తన పిచ్చి ఇజంతో యువతను పెడదారి పట్టిస్తున్న వ్యక్తి ఫిలాసఫీ మీద రామబాణం ఎక్కుపెడుతున్నానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి టైటిల్‌ లోగోను విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement