సుకుమార్‌తో సినిమా ఆగిపోయింది : మహేష్‌

Mahesh Babu Says Film with Sukumar is Not Happening - Sakshi

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు, ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన వన్‌ నేనొక్కడినే కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోయినా స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మంచి పేరు వచ్చింది. దీంతో మరోసారి ఇదే కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

అయితే తాజాగా మహేష్.. సుకుమార్‌తో మూవీ ఉండదని క్లారిటీ ఇచ్చాడు. ‘కొన్ని సృజనాత్మక అభిప్రాయ భేదాల వల్ల నేను సుకుమార్‌తో చేయాల్సి సినిమా ఆగిపోయింది. కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు. ఓ దర్శకుడి సమర్ధతకు ఎప్పుడూ గౌరవం దక్కుతుంది. వన్‌ నేనొక్కడినే సినిమా ఓ కల్ట్‌ క్లాసిక్‌. ఆ సినిమా కోసం పని చేసిన ప్రతీ క్షణం ఎంజాయ్‌ చేశాను. మీ కొత్త సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు మహేష్‌.

మహేష్‌తో చేయాల్సిన సినిమా ఆగిపోవటంతో వెంటనే సుకుమార్ మరో సినిమాను ప్రకటించాడు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు సుకుమార్‌. గతంలో వీరి కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య2 సినిమాలు తెరకెక్కాయి. ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కబోయే హ్యాట్రిక్‌ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్న బన్నీ ఆ సినిమా తరువాత సుకుమార్ సినిమాలో నటించనున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top