అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధమేఘాలు | US sends Patriot missiles, warship to Middle East to deter Iran | Sakshi
Sakshi News home page

అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధమేఘాలు

May 12 2019 5:18 AM | Updated on May 12 2019 5:18 AM

US sends Patriot missiles, warship to Middle East to deter Iran - Sakshi

ఈజిప్ట్‌ దగ్గర్లోని సూయజ్‌ కాలువ గుండా వెళ్తున్న యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ యుద్ధవిమాన వాహకనౌక

వాషింగ్టన్‌: అమెరికా–ఇరాన్‌ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన అమెరికా, తాజాగా విమానవాహక యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ ఆర్లింగ్టన్‌ను పశ్చిమాసియా సముద్రజలాల్లో మోహరిస్తున్నట్లు ప్రకటించింది. ‘పేట్రియాట్‌’ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను ఈ ప్రాంతానికి తరలించనున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు, బలగాలపై దాడికి ఇరాన్‌ పూర్తి సన్నద్ధతతో ఉందన్న నిఘావర్గాల సమాచారం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే మోహరించిన యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ యుద్ధనౌక, బీ–52 బాంబర్‌ విమానాలకు ఇవి జతకలవనున్నాయి. ఇరాన్‌తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదనీ, కానీ తమ బలగాలను, ప్రయోజనాలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణశాఖ స్పష్టం చేసింది.

ఉ.కొరియాది విశ్వాసఘాతుకం కాదు: ట్రంప్‌
‘ఉ.కొరియా స్వల్పశ్రేణి క్షిపణులనే పరీక్షించింది. అవి సాధారణమైన పరీక్షలు. క్షిపణి పరీక్షలు విశ్వాసఘాతుకమని నేను అనుకోవట్లేను. ఉ.కొరియా అధినేత కిమ్‌తో నాకు సత్సంబంధాలు ఉన్నాƇు’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. గతేడాది జూన్‌లో ట్రంప్‌తో భేటీ నేపథ్యంలో అన్నిరకాల అణు, ఖండాంతర క్షిపణి పరీక్షలను నిలిపివేస్తున్నట్లు కిమ్‌ ప్రకటించారు. ఫిబ్రవరిలో ట్రంప్‌తో రెండో విడత చర్చలు విఫలం కావడంతో ఈ ఏడాది చివర్లోగా పద్ధతిని మార్చుకోవాలని అమెరికాను కిమ్‌ హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement