
మోదీకి ఓట్లు పడలేదు
‘టైమ్–100’ ప్రభావశీల వ్యక్తుల కోసం నిర్వహించిన రీడర్ పోల్లో ప్రధాని మోదీకి ఒక్క ఓటూ పడలేదు.
‘టైమ్–100’ రీడర్స్ పోల్లో డ్యుటెర్టోకు అగ్రస్థానం
న్యూయార్క్: ‘టైమ్–100’ ప్రభావశీల వ్యక్తుల కోసం నిర్వహించిన రీడర్ పోల్లో ప్రధాని మోదీకి ఒక్క ఓటూ పడలేదు. ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల ఎంపిక కోసం ‘టైమ్’ మేగజైన్ నిర్వహించిన ఆన్లైన్ రీడర్ పోల్లో ఫిలిప్పీన్స్ వివాదాస్పద అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2016లో అత్యంత ప్రభావశీల వ్యక్తులను ఎంపిక చేసేందుకు టైమ్ మేగజైన్ రూపొందించిన ప్రముఖుల జాబితా (ప్రాబబుల్స్)లో మోదీతో సహా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంకా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్, ఫేస్బుక్ సీఈవో జుకర్బర్గ్ తదితరులు చోటు దక్కించుకున్నారు.
దీనిపై ఆన్లైన్లో రీడర్ పోల్ నిర్వహించారు. ఇందులో అమెరికాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టోకు పాఠకులు అత్యధికంగా 5% ఓట్లు వేశారు. ఆ తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, పోప్ ఫ్రాన్సిస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్లకు 3% చొప్పున వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు 2% ఓట్లు పడ్డాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త కుష్నర్లకు ఒక్క ఓటూ పడలేదు.