ట్రంప్‌–మోదీ ఫోన్‌ సంభాషణ | Phone Conversation Between Modi And Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌–మోదీ ఫోన్‌ సంభాషణ

Jan 8 2020 4:08 AM | Updated on Jan 8 2020 4:08 AM

Phone Conversation Between Modi And Trump - Sakshi

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, భారత ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు వైట్‌హౌజ్‌ మంగళవారం తెలిపింది. అమెరికా–భారత్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంతో పాటు, ప్రాంతీయ భద్రతా వ్యవహారాలను సమీక్షించినట్లు తెలిపింది. భారత ప్రజలకు ట్రంప్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారని, భారత్‌తో ద్వైపాక్షిక అంశాలను బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తానని ట్రంప్‌ చెప్పినట్లు వైట్‌హౌజ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

కొత్త ఏడాది ప్రారంభమయ్యాక ఇరుదేశాల నేతలు మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఇరాన్‌ కమాండర్‌ సులేమానీని అమెరికా చంపిన నేపథ్యంలో వీరి ఫోన్‌కాల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రంప్‌–మోదీల ఫోన్‌ కాల్‌పై ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) కూడా స్పందించింది. అమెరికా–భారత్‌ మైత్రి బలపడటమేగాక, ఇరుదేశాల ప్రయోజనాల దృష్ట్యా కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదీ పేర్కొన్నారని తెలిపింది. నమ్మకం, గౌరవం, అర్థంచేసుకోవడం వంటి అంశాలతో ఇరు దేశాలు కలసి కట్టుగా ముందుకు వెళుతున్నట్లు మోదీ చెప్పారని వెల్లడించింది. వీరిరువురి ఫోన్‌ కాల్‌కు ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోతో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement