యోగా వేడుకలు ప్రారంభం
అమెరికా సహా పలుదేశాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు
వాషింగ్టన్/న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అంతర్జాతీయ యోగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహకంగా పలు దేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేశారు. వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్తోపాటు న్యూయార్క్లోని గవర్నర్స్ ఐలాండ్లో జరిగిన ముఖ్య కార్యక్రమాల్లో అమెరికాలో భారత రాయబారితోపాటు దౌత్యాధికారులు, అమెరికా కాంగ్రెస్ సభ్యులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. న్యూయార్క్లోని గవర్నర్స్ ఐలాండ్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ సమీపంలో యోగా ఉత్సవాలు రెండు గంటలపాటు జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వారు, తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
నెదర్లాండ్స్లో రవిశంకర్ నేతృత్వంలో..
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ నెదర్లాండ్స్లో యోగా వేడుకలను ప్రారంభించారు. రాజధాని అమ్స్టర్డ్యామ్లోని మ్యూజియం స్క్వేర్లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. నేపాల్లోని ముక్తినాథ్ ఆలయంలో, పారిస్లోని ఈఫిల్ టవర్ సమీపంలో, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్, దక్షిణాఫ్రికాలోని డర్బన్లలో నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రజలు పాల్గొని ఆసనాలు వేశారు.
పారిస్లో ఈఫిల్ టవర్ ముందు యోగాసనాలు వేస్తున్న ఔత్సాహికులు