కొత్త ప్రపంచం కోసం ఈ సెలబ్రిటీలు | Madonna And Robert Lead Call For Global Change After Corona Crisis | Sakshi
Sakshi News home page

కొత్త ప్రపంచం కోసం ఈ సెలబ్రిటీలు

May 7 2020 4:06 PM | Updated on May 7 2020 7:14 PM

Madonna And Robert Lead Call For Global Change After Corona Crisis - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌పై విజయం సాధించాక ప్రపంచవ్యాప్తంగా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి వీల్లేదంటూ 200 మంది ప్రముఖులతో ఏర్పడిన క్లబ్‌లో తాజాగా ఒకప్పుడు తన గానామృతంతోనే కాకుండా అందచందాలతో కుర్రకారును కైపెక్కించిన మడోనా, తన హావ భావాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన అమెరికా నటుడు, నిర్మాత రాబర్ట్‌ డి నీరో చేరారు. ఈ క్లబ్‌లో హాలీవుడ్‌ తారలు కేట్‌ బ్లాన్‌చెట్, జేన్‌ ఫాండా, మారియన్‌ కోటిలార్డ్, మోనికా బెల్లూసితోపాటు పలువురు నోబెల్‌ అవార్డు గ్రహీతలు ఉన్నారు. హాలీవుడ్‌ తార జూలియెట్‌ బినోచ్, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అవురేలియన్‌ బర్రావ్‌లు ఈ క్లబ్‌ ఏర్పాటుకు నాంది పలికారు. (చదవండి : కరోనా: డబ్ల్యూహెచ్‌ఓ వైఫల్యం ఎక్కడ!?)



వీరంతా ఇప్పుడు ఎప్పటిలాంటి సాధారణ ప్రపంచాన్ని కాకుండా సరికొత్త ప్రపంచాన్ని కోరుకుంటున్నారు. అందుకు ఇదే సరైన అవకాశమని వారు చెబుతున్నారు. ‘కరోనా వైరస్‌ వచ్చిందేదో వచ్చింది. అది ఎంతటి దురదష్టకరమైన అది ప్రపంచంలో ఎంతో మార్పునకు అవకాశం ఇస్తోంది’ అని వీరంతా వాదిస్తున్నారు. వస్తు వినిమయంపై ఆధారపడి పనిచేసే ఆర్థిక వ్యవస్థ ఇంకెంత మాత్రం మనకు అక్కర్లేదని, భూగోళాన్ని పరిరక్షించే ర్యాడికల్‌ ఆర్థిక వ్యవస్థ కావాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. (చదవండి : ట్రంప్‌ అంతే..మాస్క్‌ ఫ్యాక్టరీలో మాస్క్‌ లేకుండా..)

నేడు ప్రపంచ పర్యావరణ పరిస్థితులు బాగా క్షీణించాయని, వీటి వల్ల కరోనా వైరస్‌లకన్నా తీవ్రమైన పర్యవసనాలు సంభవించే ప్రమాదం పొంచి ఉందని వీరు హెచ్చరించారు. నిర్లక్ష్యం చేస్తే మొత్తం మానవజాతియే అంతరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భూగోళంపై కాలుష్యం పెరిగిపోవడంతో వాతావరణ సమతౌల్యత నశించి మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడిందని చెప్పారు. ఈ మేరకు వీరంత సంతకాలు చేసిన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement