బాబూ మీ కుటుంబ సభ్యులు ప్రతిజ్ఞ చేశారా? | vasireddy padma fires on chandrababu navanirmana deeksha | Sakshi
Sakshi News home page

బాబూ మీ కుటుంబ సభ్యులు ప్రతిజ్ఞ చేశారా?

Jun 2 2016 2:14 PM | Updated on Oct 20 2018 4:47 PM

నవనిర్మాణ దీక్ష పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే తాను చేసిన మోసాన్ని గుర్తుచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

హైదరాబాద్: నవనిర్మాణ దీక్ష పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే తాను చేసిన మోసాన్ని గుర్తుచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిజ్ఞను దేశ పౌరులుగా చేయించాలి గానీ.. రాష్ట్ర పౌరులుగా కాదన్నారు. నవ నిర్మాణ దీక్షకు సంబంధించిన జీవోపై రాజద్రోహం కేసు పెట్టొచ్చన్నారు. ఏపీ ఏమైనా ప్రత్యేక దేశమా అని ఆమె ప్రశ్నించారు. చేతిలెత్తించి ప్రతిజ్ఞ చేయించినంత మాత్రాన మనమేమైనా ముందుకెళ్తున్నట్లా అని అడిగారు. చేసిన ప్రతిజ్ఞలో సైతం జై జన్మభూమి అంటూ రాజకీయాలే చేశారని విమర్శించారు. ఇంతకీ చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రతిజ్ఞ చేశారా అని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను గోబెల్స్ భవన్గా మార్చుకొవాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. దివాళాకోరు ముఖ్యమంత్రిగా మాట్లాడకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని లేకుంటే చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారన్నారు. చంద్రబాబు చేసింది నవనిర్మాణ దీక్ష కాదని అది విధ్వంస దీక్ష అని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ రాష్ట్రానికి అన్యాయమే చేశాయని అన్నారు. విభజన కోసం వెంటపడి మరీ లేఖ ఇచ్చింది బాబు కాదా.. విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీలకు లేఖలు ఇవ్వలేదా.. పార్లమెంట్లో విభజనకు తొలి ఓటు వేసింది మీ ఎంపీలు కాదా.. వారి నోటితోనే ఆ నిజాన్ని చెప్పలేదా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. చంద్రబాబు 2022, 2029, 2050 గురించి మాట్లాడుతున్నారనీ.. అయితే 2019 వరకూ ఏం చేయరా అని ఆమె ప్రశ్నించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement