టుడే న్యూస్ అప్ డేట్స్ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్ డేట్స్

Dec 23 2015 7:16 AM | Updated on Sep 3 2017 2:27 PM

రెండు రోజుల పర్యటన కోసం నేడు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా వెళ్లనున్నారు. నేటి నుంచి సీఎం కేసీఆర్ తలపెట్టిన ఆయుత చండీయాగం ప్రారంభం..

మొదటిసారి రష్యాకు: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రష్యాకు బయలుదేరి వెళ్లనున్నారు. మోదీ రష్యాకు వెళ్లడం ఇదే మొదటిసారి కావటం విశేషం. ఈ పర్యటనలో భారత్- రష్యాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటు రక్షణ, అణుఇంధన, ఆర్థిక అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి.

నేటితో 'శీతాకాలం' సరి: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మొదటి మూడురోజులు రాజ్యాంగం చర్చ తర్వాత పలు వివాదాస్పద అంశాలతో సభ సజావుగా జరగని సంగతి తెలిసిందే. చివరిరోజైన బుధవారమైనా కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.

స్పీకర్ పై అవిశ్వాసం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేడు అవిశ్వాస తీర్మానం ఇవ్వనున్నది. ఉదయం 10:30 గంటలకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేయనున్నారు.

కేసీఆర్ మెగా యాగం: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తలపెట్టిన ఆయుత మహాచండీ యాగం నేటి నుంచి ప్రారంభంకానుంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉదయం 8:10 గంటలకు క్రతువు మొదలవుతుంది. ఈ నెల 27 వరకు జరగనున్న ఈ యాగానికి పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. తొలిరోజు గవర్నర్ నరసింహన్ తోపాటు హైకోర్టు చీఫ్ జస్టీస్ బొసాలే రానున్నారు.

పీవీ వర్ధంతి: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 11వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి జ్ఙానభూమి(నెక్లెస్ రోడ్డు) వద్ద ఉదయం 9 గంటల నుంచి అధికారిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

లక్ష ఉద్యోగాల సంకల్ప దీక్ష: టీఆర్ఎస్ ప్రభుత్వ ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీ విస్మరణకు గురైందని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నేటి నుంచి లక్ష ఉద్యోగాల సంకల్ప దీక్షను ప్రారంభించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement