రాజ్యాంగ హక్కులపై ‘సంఘ్’ దాడి | 'Sangh' attack on constitutional rights | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ హక్కులపై ‘సంఘ్’ దాడి

Feb 26 2016 12:51 AM | Updated on Sep 3 2017 6:25 PM

రాజ్యాంగ హక్కులపై ‘సంఘ్’ దాడి

రాజ్యాంగ హక్కులపై ‘సంఘ్’ దాడి

రాజ్యాంగపరమైన హక్కులను సంఘ్‌పరివార్ మతోన్మాదశక్తులు హరిస్తున్నాయని పలువురు వక్తలు ఆరోపించారు.

♦ మహాధర్నాలో వామపక్ష, సామాజిక, ప్రజాసంఘాల నేతలు
♦  కన్హయ్యను విడిచిపెట్టాలి..
♦  దత్తాత్రేయ, స్మృతిఇరానీలను తొలగించాలని డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగపరమైన హక్కులను సంఘ్‌పరివార్ మతోన్మాదశక్తులు హరిస్తున్నాయని పలువురు వక్తలు ఆరోపించారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌పై పెట్టిన దేశద్రోహం కేసును ఎత్తేసి ఆయనను బేషరతుగా విడుదల చేయాలని, హెచ్‌సీయూ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారుకులైన కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను బర్తరఫ్ చేయాలని, వీసీ అప్పారావును ఆ పదవి నుంచి తొలగించాలని వామపక్షాలు, సామాజిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీహెచ్ సీతారాములు(సీపీఎం), చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా(సీపీఐ), జానకిరాములు (రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ), మురహరి(ఎస్‌యూసీఐ-సీ),  ఇంద్రకరణ్ (ఏఐఎఫ్‌బీ), భూతం వీరన్న (సీపీఐ-ఎంఎల్), శ్రీనివాస్ బహదూర్ (బీఎస్‌పీ), నలమాస కృష్ణ(టీపీఎఫ్), విమలక్క(అరుణోదయ), జిలుకర శ్రీనివాస్ మాట్లాడారు. పార్లమెంటులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రసంగాన్ని అందరూ పొగుడుతున్నారని, అసలు అందులో ఏమైనా సరుకుందా అని ప్రశ్నించారు.

దేశంలో వరుసగా జరుగుతున్న దాడులు, ఘటనలు చూస్తుంటే అత్యున్నత విద్యాసంస్థలను తమకు అనుకూలంగా మలుచుకుని, మేధావులతో గులాంగిరి చేయించుకోవాలనే సంఘ్‌పరివార్ కుట్ర కనిపిస్తోందన్నారు. తెలంగాణలో కూడా ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు ముందుకు రావాలని కోరారు. సంఘ్‌పరివార్‌శక్తులను అడ్డుకునేందుకు అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కన్హయ్య బెయిల్‌పై విడుదలైనా రక్షణలేని పరిస్థితులున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్యతో దోషిగా బోనులో నిలబడిన కేంద్రం కన్హయ్యపై దేశద్రోహం కేసుతో తప్పించుకోవాలని చూస్తోందన్నారు. రోహిత్ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో పేర్లున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ(రాయల) నేత వేములపల్లి వెంకట్రామయ్య, న్యూడెమోక్రసీ(చంద్రన్న) నేత సాదినేని వెంకటేశ్వరరావు, ఎంసీపీఐ-యూ నేత ఎండీ గౌస్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్,  కె.గోవర్థన్, డీజీ నర్సింహారావు, డాక్టర్ సుధాకర్, తేజ, గోవింద్, తాండ్ర కుమార్, గోపీ, ఝాన్సీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement