ఏక పోలీసు విధానం కష్టమే! | police officers not interested in single police policy | Sakshi
Sakshi News home page

ఏక పోలీసు విధానం కష్టమే!

Jul 4 2014 2:36 AM | Updated on Sep 2 2017 9:46 AM

ఏక పోలీసు విధానం కష్టమే!

ఏక పోలీసు విధానం కష్టమే!

తెలంగాణ ప్రభుత్వం ఏక పోలీసు నియామక విధానాన్ని అమలు చేయాలని భావిస్తుంటే.. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అది ఆచరణ సాధ్యం కాదని చెపుతున్నారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏక పోలీసు నియామక విధానాన్ని అమలు చేయాలని భావిస్తుంటే.. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అది ఆచరణ సాధ్యం కాదని చెపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఏక పోలీసు విధానంపై తమిళనాడు, హర్యానాల్లో అధ్యయనం చేసి వచ్చిన పోలీసు ఉన్నతాధికారుల బృందం తమ నివేదికను డీజీపీ అనురాగ్‌శర్మకు అందజేసింది.

ఈ నివేదికను ఒకట్రెండు రోజుల్లో డీజీపీ ప్రభుత్వానికి నివేదించనున్నారని తెలిసింది. ప్రస్తుతం స్పెషల్ పోలీస్ బెటాలియన్, ఆర్మ్‌డ్ రిజర్వు, సివిల్ పోలీసు విభాగాలకు ఎస్‌ఐ నుంచి కానిస్టేబుళ్ల వరకు నియామకాలు వేర్వేరుగా జరుగుతున్నాయి. ఈ విధానంలో సమన్యాయం జరగడం లేదని, ఇకపై రాష్ట్రంలో ఒకే నియామక విధానాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఇందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పనకు రాష్ట్ర పోలీస్ పర్సనల్ అదనపు డీజీ ఉమేష్ షరాఫ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఐజీ బాలనాగదేవి, హైదరాబాద్ కో-ఆర్డినేషన్ జాయింట్ కమిషనర్ సంజయ్‌జైన్, ఇంటెలిజెన్స్ ఎస్‌పీ రవీందర్‌తో కూడిన బృందాన్ని తమిళనాడు, హర్యానాలకు పంపింది. గతంలో తమిళనాడులో కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఒకే రిక్రూట్‌మెంట్ విధానం అమలులో ఉండేది.

దాని ప్రకారం అక్కడి ఫోర్సు (ఇక్కడ బెటాలియన్స్)లో మొదట సిబ్బందిని రిక్రూట్ చేసుకుని పదేళ్ల తర్వాత వారిని ఏఆర్‌కు.. అక్కడి నుంచి సివిల్ విభాగానికి బదిలీ చేసేవారు. అయితే ఈ విధానం వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయని, సిబ్బంది సైతం అసంతృప్తితో ఉన్నారనే కారణంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో అమలులో ఉన్న రిక్రూట్‌మెంట్ పాలసీనే అనుసరిస్తున్నారని అధికారుల అధ్యయనంలో తేలింది.

హర్యానాలో సైతం ఈ విధానం అమలు చేసి తిరిగి పాత పద్ధతిలోకి మారిపోయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లోని నియామక విధానాలపైనా ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఏక పోలీసు విధానం కంటే ప్రస్తుతం రాష్ట్రంలో అనుసరిస్తున్న నియామక విధానమే మేలైనదిగా ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. అయినాసరే దీనిపై లోతుగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డీజీపీ నిర్ణయించినట్లు సమాచారం. పోలీసు శాఖలో అధికారులు, సిబ్బందికి సమన్యాయం చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ యోచన ఆహ్వానించదగినదే అని, అయితే ఆచరణలో ఏక పోలీసు విధానం పలు సమస్యలకు దారితీస్తుందని సీనియర్ ఐపీఎస్ అధికారులు చెపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement