నెలాఖరు వచ్చినా పింఛన్ కోసం పెన్షనర్లకు నిరీక్షణ తప్పడం లేదు.
సాక్షి, హైదరాబాద్: నెలాఖరు వచ్చినా పింఛన్ కోసం పెన్షనర్లకు నిరీక్షణ తప్పడం లేదు. మార్చి ఒకటి నుంచి పంపిణీ చేయాల్సిన ఫిబ్రవరి పెన్షన్లను ఇప్పటికీ సర్కారు ఇవ్వకపోవడంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల పంపిణీ నిమిత్తం రూ.394.11 కోట్లకు గాను ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసింది కేవలం రూ.200 కోట్లే. దీంతో ఏడు జిల్లాల్లో మాత్రమే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిధుల లేమి కారణంగా మిగిలిన నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని పెన్షనర్లు మరికొన్ని రోజులు వేచి ఉండక తప్పని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర కేటగిరీల్లో మొత్తం 35.74 లక్షలమంది పెన్షనర్లు ఉండగా, కొన్ని నెలలుగా వీరందరికీ ఆసరా పింఛన్లు సకాలంలో అందడం లేదు. పింఛన్ పంపిణీ ఎప్పట్నుంచి ప్రారంభిస్తారనే విషయమై ప్రభుత్వం నుంచి కచ్చితమైన సమాచారం లేకపోవడంతో లక్షలాదిమంది బ్యాంకులు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
దశలవారీగా బ్యాంకు ఖాతాలకు...
ప్రభుత్వం నుంచి అరకొర నిధులు అందినందున, ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో మాత్రమే పింఛన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బంది చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో బ్యాంకు ఖాతాలున్న పెన్షనర్లకు దశలవారీగా పింఛను సొమ్ము జమ చేస్తున్నామని, ఖాతాల్లేనివారికి మంగళవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి మిగిలిన మొత్తం రెండ్రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని, అవి అందగానే నిజామాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కూడా పంపిణీ చేస్తామంటున్నారు.