ఇంటర్‌ పరీక్షలు షురూ! | Inter exams started | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలు షురూ!

Mar 2 2017 2:57 AM | Updated on Sep 5 2017 4:56 AM

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజైన బుధవారం జరిగిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పేపరు–1 పరీక్షకు 94.56 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

మొదటి రోజు 94.56 శాతం హాజరు
నిమిషం నిబంధనతో వెనుదిరిగిన పలువురు విద్యార్థులు
12 మందిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు


సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజైన బుధవారం జరిగిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పేపరు–1 పరీక్షకు 94.56 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్, వొకేషనల్‌ కోర్సుల్లో పరీక్షలకు హాజరయ్యేందుకు 4,75,832 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా 4,49,984 మంది విద్యార్థులు హాజరయ్యారు. 25,848 మంది గైర్హాజరయ్యారు. 12 మంది విద్యార్థులపై అధికారులు మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు బుక్‌చేశారు. నిమిషం నిబంధన కారణంగా పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోకపోవడంతో పలు ప్రాంతాల్లో విద్యార్థులు వెనుదిరిగినట్లు తెలిసింది. ప్రశ్న పత్రంలో ఒక తప్పు దొర్లినట్లు విద్యార్థులు తెలిపారు.

‘ప్రైవేటు’విద్యార్థులు ఏప్రిల్‌ 15లోగా ఫీజు చెల్లించాలి
మే/జూన్‌ నెలల్లో జరిగే ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు మినహాయింపుతో రాయాలనుకునే ప్రైవేటు విద్యార్థులు (కాలేజీల్లో రెగ్యులర్‌గా చదువుకోనివారు) ఏప్రిల్‌ 15లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు బుధ వారం ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు రూ.500 హాజరు మినహాయింపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. పదో తరగతి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఏడాది గ్యాప్‌ ఉన్నవారు ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలకు, రెండేళ్లు గ్యాప్‌ ఉన్న వారు ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరు కావొచ్చని తెలిపింది. ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన సైన్స్‌ విద్యార్థులు సైన్స్‌ నుంచి ఆర్ట్స్‌కు మారవచ్చని పేర్కొంది. ఆర్ట్స్‌లోనూ ఒక గ్రూపు నుంచి మరో దానికి మారవచ్చని వెల్లడించింది. బైపీసీ ద్వితీయ సంవత్సరం పాసైన వారు గణితం రాయాలనుకుంటే అదనపు సబ్జెక్టుగా రాసుకోవచ్చని పేర్కొంది. హాజరు మినహాయింపు కోసం విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement