నగరం ఘోరం
భాగ్యనగరం నేరాలు... ఘోరాలకు రాజధానిగా మారుతోంది. డబ్బుపై ఆశ... అడ్డదారిలో సంపాదించాలనే దురాశతో కొంతమంది రాక్షసులుగా మారుతున్నారు. విలువైన ప్రాణాలను హరిసృ్తన్నారు. హత్యాయత్నాలకు ఒడిగడుతున్నారు. యుక్తవయస్సులోనే అనేక మంది నేరస్తులుగా మాృుతున్నారు. ఈ క్రమంలో పసిపిల్లల ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఇక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. బాటసింగారంలో డబ్బు కోసం మిత్రులతో కలసి బంధువుల కుమారుణ్ణి అపహరించిన ఓ వృక్తి...తన పన్నాగం బెడిసికొడుతుందని గ్రహించి ఆ పిల్లాడిని అంతమొందించగా... నిజాం పేట్లో నగల కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను హత్య చేశారు. సూరారంలో ఓ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన ఓ వ్యక్తి...నగల కోసం ఆ ఇంట్లోని మహిళపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలు నగరంలో సంచలనం సృష్టించాయి.
సాయంత్రం 3.45 గంటలు...
సూరారం గ్రామం. మాధవి అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. బంధువైన గడ్డం శ్రీనివాసరెడ్డి ఆమె భర్త కోసం వచ్చానని చెప్పి..ఇంట్లోకి ప్రవేశించాడు. తన మిత్రులతో కలసి ఆమె మెడలోని పుస్తెలతాడును కాజేయాలని ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో గొంతు కోసేశాడు. ఆమె కేకలు విని చుట్టు పక్కల వారు స్పందించడంతో నిందితులు పరారయ్యారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఉదయం 11.30- 12 గంటలు...
నిజాంపేట్ బృందావన్ కాలనీ ప్లాట్ నెం.39. ఇంట్లో ఒంటరిగా ఉన్న అన్నపూర్ణ(54) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు పొట్టన పెట్టుకున్నారు. ఆమె ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను దోచుకుపోయారు. పోలీసులు తమ ఆచూకీ తెలుసుకోకుండా ఉండేందుకు నిందితులు ఆమె మృతదేహంపై కారం చల్లి పరారయ్యారు.