
సాగు పరిశ్రమలకు ప్రోత్సాహం: కోదండరాం
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా చిన్నతరహా పరిశ్రమలు పురోగతి సాధిస్తాయని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా చిన్నతరహా పరిశ్రమలు పురోగతి సాధిస్తాయని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. శనివారం కాప్రా చిన్న పరిశ్రమల యజమానుల సమాఖ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో చిన్న పరిశ్రమల మనుగడకు ప్రత్యేక చర్యలు తీసుకునే దిశగా తమ కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని చెప్పారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానుల సూచనలు, ప్రతిపాదనలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎంఈ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి, తెలంగాణ పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షుడు సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రా ప్రాజెక్టులకు తెలంగాణ అధికారా..?
ఐఏఎస్ నాగిరెడ్డి నియామకంపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన ప్రభావం ఐఏఎస్ల పైనా పడింది. కొద్ది రోజుల కింద ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డిని సాగునీటి పారుదలశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో అప్పటి వరకు పదవిలో ఉన్న జవహర్రెడ్డి నుంచి తెలంగాణకు చెందిన నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సాగునీటి పారుదల శాఖలో ప్రస్తుతం నలుగురు కార్యదర్శులు ఉన్నారు. ఇందులో కాడ్మియల్ మైనర్ ఇరిగేషన్, అరవిందర్రెడ్డి రాయలసీమ , ఆదిత్యనాథ్దాస్ తెలంగాణ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నారు. కాగా, నాగిరెడ్డి ఆంధ్రా ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతలను స్వీకరించారు. అయితే ఆయన నియామకంపై ఆంధ్రాకు చెందిన కొందరు వ్యక్తులు గవర్నర్తోపాటు రాష్ట్రపతికి ఫిర్యాదు లేఖలను పంపించినట్టు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన నాగిరెడ్డి సెలవుపై వెళ్లారు.