వేగం తగ్గొద్దు... పనులు ఆగొద్దు | CS orders on GST implementation | Sakshi
Sakshi News home page

వేగం తగ్గొద్దు... పనులు ఆగొద్దు

Aug 10 2017 2:40 AM | Updated on Sep 11 2017 11:41 PM

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం తగ్గవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు

- జీఎస్టీ ప్రభావాన్ని అంచనా వేసుకుని ముందుకెళ్లండి
ఉన్నతాధికారులకు సీఎస్‌ ఆదేశాలు
 
సాక్షి, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం తగ్గవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు నిలిచిపోకుండా సంబంధిత ఏజెన్సీలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. జీఎస్టీ అమలు ప్రభావం అభివృద్ధి పనులపై ఏ మేరకు ప్రభావం చూపనుందనే అంశంతోపాటు, పలు శాఖల ఉన్నతాధికారులకు జీఎస్టీపై అవగాహన కల్పించేందుకుగాను సచివాలయంలో బుధవారం ఆయన ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ సింగ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన మిషన్‌ కాకతీయ, భగీరథ, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లకోసం పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నామని, వీటిని సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

పలు అభివృద్ధి పనులపై పడే జీఎస్టీ ప్రభావాన్ని అంచనా వేసుకుని ముందుకెళ్లాలని, ఈ పనుల విషయంలో ప్రభుత్వం జారీచేసిన మెమోకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఏజెన్సీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇంజనీరింగ్‌ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కూడా ఆయన సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్‌.కె.జోషి, సురేష్‌ చందా, చిత్రా రామచంద్రన్, బీపీ ఆచార్య, బీఆర్‌ మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వ్యాట్, జీఎస్టీలకు ఉన్న తేడాలపై అధికారులకు అవగాహన కల్పించారు. 

Advertisement
 
Advertisement
Advertisement