అఫిడవిట్టే అడ్డంగా పట్టించింది!
అసలే ఎమ్మెల్సీ.. అందునా పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేత..
- టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి బుక్కైంది దాంతోనే..
- నోటీసులిస్తే సంబంధం లేదంటూ సమాధానం
- ఈసీ నుంచి అఫిడవిట్ తీసుకున్న సీసీఎస్
- అందులో ‘ఆ స్థలాలు’ తనవేనంటూ స్పష్టీకరణ
- షకీల్ ఇస్లాం ఖాన్గా నటించిన బషీర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అసలే ఎమ్మెల్సీ.. అందునా పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేత.. దీంతో దీపక్రెడ్డి అరెస్టు విషయంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వ్మూహాత్మకంగా వ్యవహరించారు. నోటీసులు ఇచ్చినప్పుడు సంబంధం లేదంటూ తప్పించుకోజూసిన దీపక్రెడ్డి బండారం బయట పెట్టింది ఆయన దాఖలు చేసిన అఫిడవిట్టే. దీపక్రెడ్డితో పాటు కబ్జా వ్యవహారాల్లో సహ నిందితుడు న్యాయవాది శైలేష్ సక్సేనా వ్యవ హారాలను పోలీసులు లోతుగా ఆరా తీస్తు న్నారు. వీరు బినామీలుగా వినియోగిం చుకున్న వారికోసం గాలిస్తున్నారు. కాగా, భోజగుట్ట భూమిని కబ్జా చేయడానికి షకీల్ ఇస్లాం ఖాన్గా నటించిన బషీర్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.
నోటీసులిస్తే సంబంధంలేదంటూ..
దీపక్రెడ్డిపై ఉన్న కేసులకు సంబంధించి సీసీఎస్ పోలీసుల తొలుత ఆయనకు మూడు నోటీసులు జారీ చేశారు. తనకు ఆ కేసులతో సంబంధాలు లేవని, ఎవరో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దీపక్రెడ్డి ప్రచారం మొదలెట్టారు. ఓ కేసులో ఆయన న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ సైతం పొందారు. మిగిలిన కేసుల్లో మరిన్ని ఆధారాలు సేకరించాలని నిర్ణయించుకు న్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దీపక్ రెడ్డి నామినేషన్తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్పై కన్నేశారు. ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ద్వారా అధికారికంగా దీన్ని తీసుకున్న సీసీఎస్ పోలీసులు అధ్యయనం చేశారు. ఏ స్థలాలకు సంబంధించి దీపక్రెడ్డి తన సంతకాలు ఫోర్జరీ చేశారని, కబ్జాలతో తనకు సంబంధం లేదని చెప్తున్నారో.. అవే వివరాలు అఫిడవిట్లలో కనిపించాయి. అవన్నీ తన స్థలాలే అని, అనివార్య కారణాల వల్ల కేసులు ఉన్నాయంటూ పిటిషన్ నంబర్లతో పాటు దీపక్రెడ్డి పేర్కొన్నారు. అప్పటికే బోగస్ డాక్యుమెంట్ల సృష్టికి సంబంధించి తిరుగులేని ఆధారాలు సేకరించిన సీసీఎస్ పోలీసులు ప్రధానంగా ఆ అఫిడవిట్ ఆధారం గానే దీపక్రెడ్డిపై చర్యలు తీసుకున్నారు.
ఆయుధ లైసెన్సులపై సీసీఎస్ దృష్టి..
దీపక్రెడ్డి, శైలేష్ సక్సేనాలకు సంబంధించిన ఆయుధ లైసెన్సులపై సీసీఎస్ పోలీసులు దృష్టి పెట్టారు. పాతబస్తీలో నివసించే శైలేష్ సక్సేనాకు 2011లో ఆయుధ లైసెన్సు మంజూరైంది. దీనిపై రెండు ఆయుధాలు ఖరీదు చేసిన ఆయన మొఘల్పుర ఠాణాలో రిజిస్టర్ చేయించారు. నిబంధనల ప్రకారం నేరచరితులకు ఆయుధ లైసెన్సులు జారీ చేయకూడదు. ఉన్న లైసెన్సులు రద్దు చేయాలి. దీంతో సీసీఎస్ పోలీసులు శైలేష్ సక్సేనా ఆయుధ లైసెన్సు రద్దు చేయాల్సిందిగా మొఘల్పుర ఠాణాకు సిఫార్సు చేస్తూ శుక్రవారం లేఖ రాశారు. దీపక్రెడ్డికి సైతం ఆయుధ లైసెన్సు ఉందా? అనేది ఆరా తీస్తున్నారు. మరోవైపు దీపక్రెడ్డి, శైలేష్ సక్సేనాపై వచ్చిన మరో రెండు ఫిర్యాదులకు సంబంధించి కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు.
దీపక్రెడ్డి, శైలేష్ సక్సేనాపై మరో ఫిర్యాదు
ఎమ్మెల్సీ దీపక్రెడ్డి అండ్ కోపై సీసీఎస్ పోలీసులకు శుక్రవారం మరో ఫిర్యాదు అందింది. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీన్ని ఇచ్చారు. ఎమ్మెల్యే కాలనీలో ఉన్న 898.3 చదరపు గజాల స్థలంపై బోగస్ డాక్యుమెంట్లు తీసుకున్న దీపక్రెడ్డి, శైలేష్ సక్సేనా దాన్ని తమ పేరుపై మార్చుకున్నట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స్థలానికి బాలయ్య అనే వ్యక్తి యజమాని అంటూ శైలేష్ సక్సేనా బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారు.
ఆ స్థలాన్ని బాలయ్య మరో వ్యక్తి అయిన రాధాకృష్ణ ఠాకూర్కు 16.4.1987లో అమ్మినట్లు సేల్ డీడ్ రూపొందించారు. ఇక్కడ మావూరి శివభూషణాన్ని రాధాకృష్ణ ఠాకూర్గా పేర్కొన్నారు. 8.11.2006లో ఠాకూర్ ఈ స్థలాన్ని దీపక్రెడ్డి పేరుతో సేల్ కమ్ జీపీఏ చేశారు. కొన్ని మార్పులు అవసరం కావడంతో 2008 మార్చ్ 3న దీపక్రెడ్డి పేరుతోనే మరో రాటిఫికేషన్ డీడ్ చేయించారు. ఈ సందర్భంలో శైలేష్ సక్సేనా సాక్షి సంతకం చేశాడు. ఇలా సృష్టించిన పత్రాల ఆధారంగా దీపక్రెడ్డి సైనిక్పురిలోని ఓ బ్యాంకు నుంచి రూ.6 కోట్ల రుణం తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఫిర్యాదు స్వీకరించిన సీసీఎస్ పోలీసులు ప్రాథమిక విచారణ చేస్తున్నారు.