నడుస్తున్న చరిత్ర | To the history of discrimination | Sakshi
Sakshi News home page

నడుస్తున్న చరిత్ర

Apr 14 2017 12:07 AM | Updated on Sep 5 2017 8:41 AM

ఏ పోరాటమైనా మొదలైనప్పుడు దానికో అంతం ఉంటుంది. లక్ష్యం ఆ అంతానికి ఆది.

ఏ పోరాటమైనా మొదలైనప్పుడు దానికో అంతం ఉంటుంది. లక్ష్యం ఆ అంతానికి ఆది. లక్ష్యం మెండుగా ఉంది. పోరాటం గురి తప్పలేదు. కాని ఎందుకో పోరాటానికి అంతం రావడంలేదు. వివక్ష పోవాలని అందరూ కోరుకుంటున్నారే తప్ప అంతం చేయాలని అనుకోవడం లేదు. ఇప్పటికీ మన దేశంలో ఉన్న వివక్షకు పంచభూతాల సాక్షిగా నిలుస్తున్న కథలు ఇవి. అంతా యథార్థమే... నడుస్తున్న చరిత్రే!!

జయ విజయం సాధించేనా?
ఆమె పేరు జయ. పేరులో తప్ప బతుకులో జయం లేదు. భర్త అర్ధంతరంగా చనిపోయాడు. ఆరుగురు ఆడపిల్లలు. భర్త చెమట చిందించి సంపాదించిన రెండున్నర ఎకరాల భూమి తప్ప ఏమీ లేవు. మామ కూడా లేడు. అత్తది అగ్రకులం. ఆస్తి ఇవ్వడం ఇష్టం లేదు. పోలీసుల అండతో, కులం బలంతో జయపై దాడి చేయించింది. జయ బిడ్డను కిడ్నాప్‌ చేయించింది. అనేక రకాల హింసలు పెట్టింది. జయ భయపడలేదు. అన్న సహాయంతో కోర్టులో కేసు వేసింది. ప్రాణభయం ఉన్నా లెక్క చేయలేదు. పిల్లల్ని చదివించుకుంటూ న్యాయం కోసం పోరాడుతోంది. ఒక బిడ్డ పెళ్లి చేయగలిగింది. కుల సంఘాలని కదిలించింది. అగ్రకులం, అధికారం, పోలీసులు ఒకవైపు.. మొక్కవోని ధైర్యంతో తనే ఒక సైన్యంగా జయ ఒకవైపు! మరి రేపటి న్యాయం ఎటువైపు?

తాను పుండై.. తనువు పండై
ఆమె అరుణ. కులం మాదిగ. నలుగురు ఆడపిల్లల్లో పెద్దది. తల్లిదండ్రులు దినసరి కూలీలు. అయినా పట్టుదలతో ఇంజనీరింగ్‌ వరకు వచ్చింది. కానీ పూర్తి చేయలేకపోయింది. పేదరికం వల్ల చదువు ముందుకు సాగలేదు. మధ్యలోనే తిరిగి తన ఊరు చేరుకుంది. ఏదైనా ఉద్యోగం చూసుకుని కుటుంబానికి ఆసరాగా నిలబడాలను కుంది. తన ఊరికి దగ్గరలోనే పోలీసు శాఖ వారు కానిస్టేబుల్‌ శిక్షణ ఇస్తుంటే చేరింది. ఒకనాడు ఇంటిదగ్గర దించుతానంటే సాటి మనుషులే కదా అని ఆ మగాళ్లను నమ్మి బండి ఎక్కింది. అంతే. ఊరవతలకు వెళ్లగానే వాళ్లు మృగాళ్లయ్యారు. ఆ ముగ్గురికి బలైపోయింది.   వీడియో తీసారు. ఎవరికైనా చెబితే వీడియో బయట పెడతామని బెదిరించారు. అవమానం భరించలేక అమ్మమ్మ ఊరుకు పోయి చచ్చిపోవాలనుకుంది. మేనమామ ఆపాడు. విషయం తెలుసుకున్నాడు. నిందితులు దొరికారు. అప్పటికే వీడియోలు బయట పడ్డాయి. చేతులు మారాయి. అంతా అరుణనే తప్పు పట్టారు. తిరుగుబోతు అన్నారు. పేపర్లు, టీవీలు, దళిత సంఘాల వారు మొత్తుకున్నా న్యాయం జరగలేదు. అరుణ జీవచ్ఛవమై బతుకుతోంది.

అంటరాని ఒంటరి పోరు
ఈమె రేణుక. 20 ఏళ్ల వయసు. పెళ్లి కాలేదు. అంటరాని కులంగా అగ్రవర్ణాలు ముద్రేసిన మాదిగగా పుట్టింది. ఊరు ఆమెను ఎన్నడూ పట్టించుకోక పోయినా ఆమె ఊరును పట్టించుకుంది. పచ్చని పల్లెటూరిలో విషం చిమ్మే ఫ్యాక్టరీ వచ్చి చిచ్చుపెట్టింది. రేణుక ఊరందరినీ ఏకం చేసి ఫ్యాక్టరీకి ఎదురు తిరిగింది. జనాన్ని కూడదీసి అమ్ముడు పోయిన పెద్దలను నిలదీసింది. ఫ్యాక్టరీ తీసేయాలని పోరాడింది. ఫలితంగా దాడులు, అవమానాలు, కేసులు! అరోగ్యం పాడైపోయింది. ఊరంతా భయపడి వెనక్కి తగ్గింది. దాడులు వల్ల అయిన గాయాలు మిగిల్చిన పక్కటెముకల్లోని నొప్పితో రేణుక మాత్రం ముందుకే నడిచింది. అయినా ఆమె బలం సరిపోలేదు. అందుకే ఫ్యాక్టరీ నిర్మాణమైంది. దుర్గంధాన్ని వెదజల్లుతూ దర్జాగా నడుస్తోంది. లంచాలు తిని ఊరిని తాకట్టు పెట్టిన పెద్దలు ధీమాగా తిరుగుతున్నారు. ఈ ఒంటరి పోరాటంలో అవమానాలతో రేణుక అలసి పోయింది. పిల్లి తరిమిన కోడి పిల్లలాగా ఊరు దిగాలుగా చూస్తోంది.

దళిత తల్లికి ఎంత కష్టం ఎంత కష్టం
సమ్మక్క... చిన్నప్పుడే పెళ్లయింది. నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు పిల్లలు చనిపోయారు. కొడుకు ఒక్కడే మిగిలాడు. 23 ఏళ్లు వచ్చాక కొడుకు రెండు కిడ్నీలు పాడైపోయాయి! భర్త ఒక కిడ్నీ ఇచ్చినా కొడుకును బతికించుకోలేకపోయారు. భర్త కూడా దక్కలేదు. నలభై ఏళ్ల వయసులోనే అందరినీ కోల్పోయి ఒంటరిదైపోయింది సమ్మక్క. కష్టాలు అక్కడితో ఆగలేదు. ఆమెకు యాక్సిడెంట్‌ అయింది. తొమ్మిదినెలలు మంచం మీద నుంచి లేవలేదు. ఇల్లు అప్పులతో మునిగిపోయింది. నిలువ నీడ లేక తిరుగుతుంటే రైల్వేస్టేషన్‌లో ఒక వ్యక్తి సమ్మక్కను చూసి టాయిలెట్లు కడిగే పని ఇప్పించాడు. చాలీ చాలని డబ్బులతో నిండని కడుపును నీళ్లతో నింపుకుంటోంది. ఉండడానికి ఒక చూరు రాయించమని కన్నీళ్లతో అందరి కాళ్లావేళ్లా పడుతోంది సమ్మక్క.

కలల పునాదుల మీద కొడుకు సమాధి
ఆమె రాధిక. పుట్టింది దళిత మాల కుటుంబంలో. పెరిగింది వడ్డెరకులంలో. పెంచిన తల్లి ఉద్యోగస్తురాలు. ఆమెకు, ఆమె పిల్లలకు పుట్టెడు చాకిరీ చేస్తూ పెరిగింది. చిన్న వయసులోనే వడ్డెర కులస్తుడితో పెళ్లి జరిగింది. భర్తకు తన కులం తెలిసినప్పటి నుంచి నరకం మొదలైంది. భరించలేక విడాకులు తీసుకుంది. కుట్టు మిషన్‌ కుడుతూ ఒంటరిగా ముగ్గురు పిల్లల్ని పెంచింది. బిడ్డకు వడ్డెర కులస్తుడితో పెళ్లి జరిపించింది. పెద్దకొడుకు పెద్ద చదువులు చదువుతున్నాడని మురిసిపోయింది. పేదరికానికి స్వస్తి పలకొచ్చని ఆశపడింది. కానీ తన ఉసురు పోసుకున్న కులమే తన కొడుకు ప్రాణాలనూ తీసింది.

అతడే రోహిత్‌ వేముల. తల్లి గుండె పగిలింది. కులం రాజకీయమైంది. ఒంటరి జీవితం అవమానాల, అనుమానాల పరం అయింది. అయినా ధైర్యం తెచ్చుకుని.. అనారోగ్యం, దుఃఖం వెంటాడుతున్నా కూడా తన కొడుకు లాగా మరొక బిడ్డ బలి కాకూడదని కులప్రభావ ప్రవాహానికి ఎదురీదుతోంది. పెంచుకున్న తల్లి లేదు. పంచుకున్న భర్త లేడు. కని పెంచిన కొడుకు లేడు. అయినా మనోనిబ్బరంతో కులాల కుళ్లుకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తోంది రాధిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement