
తల్లీ నిన్ను దలంచి
మహాత్మాగాంధీ దాస్య విముక్తి, స్వామీ వివేకానంద జ్ఞానయోగం... ఆ రెండూ కలిసిన ‘విముక్తి జ్ఞానం’...
⇒ మీరు చదవడం, రాయడం వచ్చిన అమ్మాయైతే మీరు ఆమెకు రుణపడి ఉన్నారు.
⇒ మీరు ఇంగ్లిష్ చదవగలిగిన స్కూల్ గర్ల్ అయితే మీరు ఆమెకు రుణపడి ఉన్నారు.
⇒ మీరు బాగా చదువుకున్న మహిళ అయితే మీరు ఆమెకు రుణపడి ఉన్నారు.
⇒ మీరు ఉన్నత హోదాలో ఉన్న ఉమన్ ఎన్నారై అయితే మీరు ఆమెకు రుణపడి ఉన్నారు.
నేడు టీచర్స్ డే
మహాత్మాగాంధీ దాస్య విముక్తి, స్వామీ వివేకానంద జ్ఞానయోగం... ఆ రెండూ కలిసిన ‘విముక్తి జ్ఞానం’.. సావిత్రీబాయి! ‘స్త్రీలకు వివక్ష నుంచి, దళితులకు అంటరానితనం నుండి, వితంతువులకు దురాచారాల సంకెళ్ల నుంచి విముక్తి కావాలి. విముక్తి.. జ్ఞానం నుంచి, జ్ఞానం.. చదువు నుంచి వస్తుంది’ అని చెప్పేవారు సావిత్రీబాయి.
పెళ్లయింది! ‘సావిత్రీబాయి వెడ్స్ జ్యోతీరావు’. గాష్! కొంపలు మునిగిపోవూ ఇలాగంటే! ఏం కాలమది?! ఎయిటీన్ ఫార్టీస్. ‘జ్యోతీరావు వెడ్స్ సావిత్రీబాయి’ అని మాత్రమే అనాలి. అమె ఆయన్ని చేసుకుందనడం మహాపచారం. ఏ ఇంట్లో అయినా , ఏ పందిట్లో అయినా.. ఆయనే ఆమెను చేసుకుంటాడు! అలాగే చేసుకున్నాడు జ్యోతీరావు. చేసుకున్నాక, ఏడడుగులు నడిచాక.. కాదు కాదు.. నేను ముందు, నువ్వు వెనుక కాదు అన్నాడు! నేను బయట, నువ్వు లోపల కాదు అన్నాడు! నాదొక మాట, నీదొక మాట కాదు అన్నాడు. అసలు నువ్వూనేను వేర్వేరు కాదు అన్నాడు. ఆ మాటే.. అతన్ని వేరు కాపురం పెట్టించింది!
‘ఇదిగో అమ్మాయ్.. నువ్వూ వెళ్లిపో’
అత్తగారిల్లు. బిక్కుబిక్కుమంటూ.. తప్పు చేసిన పిల్లలా నిలబడి ఉంది సావిత్రీబాయి. తప్పు చేయలేదని అమెకు తెలుసు. కానీ నిలబడి ఉంది. భర్త ముందూ కాదు, భర్త వెనకా కాదు. భర్త పక్కనే నిలబడి ఉంది. పెద్దగా అరిచేస్తున్నారు గోవిందరావు. సావిత్రీబాయి మామగారు ఆయన. అత్తగారు లేరు. జ్యోతీరావు నెలల బిడ్డగా ఉన్నప్పుడే ఆమె చనిపోయారు.
‘‘ఇంటి పరువు మంట కలిపితే ఊరుకునేది లేదు’’... అంటున్నారు గోవిందరావు. కొడుకు మీదే ఆయన కోపమంతా. కోపం ఎందుకంటే... కోడలికి చదువు చెప్పిస్తున్నాడని! ఆడపిల్ల చదువుకోవడమే ఆయనకు ఇష్టం లేదు. ఇక పెళ్లయిన ఆడపిల్లను చదివిస్తుంటే ఊరుకుంటాడా? ‘‘ఇంట్లోంచి వెళ్లిపో’’ అన్నారు కొడుకుని. ఆ వెంటనే కోడలి వైపు తిరిగి, ‘‘ఇదిగో అమ్మాయ్... నువ్వీ ఇంట్లో నిరభ్యంతరంగా ఉండొచ్చు. లేదూ, భర్తతోనే కలిసుంటానంటావా... నువ్వూ బైటికి వెళ్లిపోవచ్చు’’ అన్నారు. రెండో ఆలోచన చేయలేదు సావిత్రీబాయి. భర్తతో కలిసి బయటికి వచ్చేసింది. అప్పుడు ఆమె వయసు 10 సంవత్సరాలు! భర్తకు 13.
ఆడపిల్లలట! వాళ్లకో పంతులమ్మట!!
మరో పదేళ్లు గడిచాయి. సావిత్రీబాయి చదువు పూర్తయింది. సావిత్రీబాయే స్వయంగా స్కూలు పెట్టింది! ఆడపిల్లల స్కూలు!! ఫస్ట్ బ్యాచ్లో 9 మంది. పుణెలో, ఆ చుట్టుపక్కల అదొక సంచలనం. ఆడపిల్లలంట! వాళ్లకో పంతులమ్మట! రెండూ విడ్డూరాలే. రెండూ ముక్కు మీద వేళ్లే. సిగ్గూశరం లేదా అని సంప్రదాయం పళ్లు పటపటలాడించింది. అదేం పట్టించుకోలేదు సావిత్రీబాయి. ఆమెకు ఇంకా చాలా పని ఉంది. ఆడపిల్లల చేత ఉద్యోగాలు చేయించాలి. ఆడపిల్లల మెడలో పడబోయే ముసలి తాళిబొట్లను తెంపేయాలి. భర్త చనిపోయిన ఆడపిల్లలకు మళ్లీ పెళ్లి చేయించాలి. అనాధలైన ఆడపిల్లల్ని, అత్యాచారాలకు గర్భిణులైన ఆడపిల్లల్ని చేరదియ్యాలి. ఇంకా... ఆడపిల్లలపై ఆంక్షల్ని, ఆడపిల్లలంటే ఉన్న వివక్షనీ రూపుమాపాలి. ఆడామగ తేడా పాటిస్తున్న సమాజాన్ని, కులం కులం అంటూ కలవరిస్తున్న సమాజాన్ని నిద్రలేపాలి. ఇలా చాలా పనులు! ఒకటొకటీ మొదలు పెట్టారు సావిత్రీబాయి. కష్టాలు కూడా ఒకటొకటిగా మొదలయ్యాయి ఆమెకు.
ఎత్తుకుని... హృదయానికి హత్తుకుని...
‘తను చెడిపోయింది కాక, సమాజాన్నీ చెడగొడుతుందా?’.. మొదటి రాయి. ‘ఇంట్లో నెగ్గుకు రాలేనివాళ్లే ఇలా వీధుల్లో పడతారు’ రెండో రాయి. ‘అసలు ఆడదేనా?’.. మూడో రాయి. తర్వాత రాళ్లు, ఆ తర్వాత రాళ్ల వర్షం. ప్రతి రాయికీ చేతులు అడ్డుపెట్టారు సావిత్రీబాయి భర్త జ్యోతీరావు ఫూలే. తనపై పడబోయిన రాయి మిస్ అయి, భర్తకు తగలబోతున్నప్పుడు తనే వెళ్లి ధైర్యంగా అడ్డు నిలిచి భర్తను కాపాడుకున్నారు సావిత్రీబాయి. రాళ్లు విసురుతున్న వారి మీద కోపం రాలేదు ఈ దంపతులకు. దురాచారాల పర్వతాలను ఒక్కొక్కటి గా బీటలు వారుస్తూ, బద్దలు కొడుతూ వస్తున్నప్పుడు రాళ్లొచ్చి మీద పడడంలో ఆశ్చర్యం ఏముందీ అనుకున్నారు. ఈ తప్పొప్పుల తలనొప్పులకు చదువొక్కటే మందు వెయ్యగలదని అనుకున్నారు. సావిత్రీబాయి చదువుల డాక్టర్ అయ్యారు. చదువు చెప్పడం, చదువుకోమని చెప్పడం, సమాజ సేవ చెయ్యడం... పూర్తిగా ఆ మహాయజ్ఞంలో సమిథలా పడిపోయారు సావిత్రీబాయి. పుణెలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు పదేళ్ల చిన్నారిని చేతుల్లోకి ఎత్తుకుని, హృదయానికి హత్తుకుని ప్లేగు సోకి మరణించారు సావిత్రీబాయి.
ఆడవాళ్లు నోరెత్తినా... అది బరితెగింపేనా!
మహాత్మాగాంధీ దాస్య విముక్తి, స్వామీ వివేకానంద జ్ఞానయోగం... ఆ రెండూ కలిసిన ‘విముక్తి జ్ఞానం’.. సావిత్రీబాయి. స్త్రీలకు వివక్ష నుంచి, దళితులకు అంటరానితనం నుండి, వితంతువులకు దురాచారాల సంకెళ్ల నుంచి విముక్తి కావాలి. విముక్తి జ్ఞానం నుంచి, జ్ఞానం చదువు నుంచి వస్తుందని సావిత్రీబాయి క్లాసులో చెబుతున్నప్పుడు క్లాసు బయటి నుంచి రాళ్లొచ్చి పడ్డాయి! ఏదైనా చెప్పే చొరవ, చేసే ధైర్యం మగాళ్లకే ఉండాలి. ఆడవాళ్లు చెప్పినా, చేసినా అది ‘బరితెగింపు’. ఈ మదర్ ఆఫ్ ఇండియన్ మోడర్న్ ఎడ్యుకేషన్, ఈ మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజం.. తన కాలంలో ఒక ఒంటరి పోరాట యోధురాలు. భర్త సహాయం ఉంటే ఉండొచ్చు. ‘మహిళ’గా ఆమె ఒంటరి. ఒంటరిగానే, వట్టి చేతులతోనే సంప్రదాయాల చీకటి గది అద్దాలను బద్దలు కొట్టారు. పందొమ్మిదో శతాబ్దపు సూపర్ ఉమన్ సావిత్రీబాయి.
బడి తెరుచుకుంది... ఊరు తలుపులు వేసుకుంది
ఇంట్లో పశువుల్లాగే ఇంట్లో ఆడవాళ్లు! అలాంటి టైమ్లో సావిత్రీబాయిని చదువు సూపర్ గర్ల్గా మార్చింది. అప్పట్లో రైట్ టు ఎడ్యుకేషన్ బ్రాహ్మల పిల్లలకు మాత్రమే. అందులోనూ మగపిల్లలకు మాత్రమే. అదొక రూల్. రూల్ తప్పితే ఎలాగుంటుందో సావిత్రీబాయికి మొదటి రోజే తెలిసింది. బాలికల కోసం భిదే వాడలో పాఠశాలను తెరిచినప్పుడు.. ఆ ఊళ్లోని తలుపులన్నీ మూసుకుపోయాయి. ఆడపిల్లల్ని బయటికి రానివ్వలేదు. కనీసం స్కూలు వైపు తొంగి చూడనివ్వలేదు. సావిత్రీబాయి ఇంటింటికీ వెళ్లి అడిగారు.. ‘మీ అమ్మాయిని బడికి పంపించండి. భవిష్యత్తు బాగుంటుంది’ అని. ఇళ్లల్లోని ఆడవాళ్లు ఆసక్తిగా కళ్లింత చేసుకుని చూశారు. మగవాళ్లు ఆగ్రహంతో కళ్లెర్ర చేశారు. భిక్షానికి ఇంటి ముందుకు వచ్చిన యాచకురాల్ని కసురుకున్నట్లుగా విసుక్కున్నారు. ‘మనుషులు విడిగా మంచివాళ్లే. కానీ సామాజిక భయం వాళ్లలోని మంచితనాన్ని దాచేస్తుంది’ అని ఫరార్, మిషెల్ పాఠశాలల్లో చదువుకుంది సావిత్రీబాయి. మళ్లీ ఓపిగ్గా ‘యాచన’ మొదలు పెట్టింది.
ఆ చేతిలో పుస్తకాలు... ఈ చేతిలో చీర
బ్రిటిష్ ఇండియాలో తొలి గర్ల్స్ స్కూల్ మొదలైంది!! కులాలు కలివిడిగా బెంచీల మీద కూర్చున్నాయి. ఆ ఆడపిల్లల కళ్లల్లో ఎంత సంతోషం. ఎంత ఉత్సాహం! ఏదైనా సరే సాధించేలా ఉన్నారు వాళ్లు. సమాజాన్ని మార్చేద్దాం వస్తారా అంటే ‘సై’ అనే లా ఉన్నారు. ఆ స్పార్క్ని గమనించారు సావిత్రీబాయి. పాఠాలు మొదలు పెట్టారు. సంస్కృతి పాఠాలు, సంస్కరణల పాఠాలు. వ్యక్తిత్వ వికాసాల పాఠాలు, వీరోచిత పోరాటాల పాఠాలు. బయటివాళ్లూ ఊరుకోలేదు. ఈ టీచరమ్మ సావిత్రీబాయికి పెద్ద పాఠమే నేర్పాలి అనుకున్నారు. స్కూలుకు వెళ్లడానికి ఇంట్లోంచి రానివ్వకుండా ఆమెను ఇంటి బయట అడ్డుకున్నారు. స్కూలుకు వెళ్లే దారిలో అడ్డుకున్నారు. రాళ్లు విసిరారు. బురద చల్లారు. సావిత్రీబాయి సంకల్పబలం సడలలేదు. చేతిలో పుస్తకాలతో పాటే చేతి సంచిలో ప్రతిరోజూ రెండో చీర ఉండేది. బురద తో చీర పాడైతే మార్చుకోడానికి. చివరికి ఆమె చీర మార్చుకోనవసరం లేకుండా, మనుషులే మారడం మొదలుపెట్టారు! ఆ మార్పు సావిత్రీబాయిలో ఎంత ఉత్సాహాన్ని తెచ్చిందంటే... ఆమె రెండో స్కూలు కూడా తెరిచారు! అది మహిళల కోసం. ఆ తర్వాత కొన్నాళ్లకు మూడో స్కూలూ మొదలైంది. అదీ బాలికలు, మహిళలకే.
సరస్వతీ నమస్తుభ్యం
ఇవాళ్టి సర్వశిక్షా అభియాన్, రైట్ టు ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్.. 150 ఏళ్ల క్రితమే సావిత్రీబాయి ఆలోచనల్లోంచి ఆచరణలోకి వచ్చాయి. ‘నా జీవితమే నా సందేశం’ అని గాంధీజీ అన్నారు. సావిత్రీబాయి ప్రత్యేకంగా ఇచ్చి వెళ్లని సందేశం ఆమె జీవితం! ఆమె ఫైటర్. కొడుక్కి కట్నం లేకుండా, పురోహితులు లేకుండా, కులం చూసుకోకుండా ధైర్యంగా పెళ్లి చేశారు. పెళ్లికి ముందే కోడల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు!! ఆ పిల్ల చదువుకోడానికి వీలుగా ఇంటి పనులన్నీ తనే చేసుకున్నారు. ఆమె వారియర్. భర్త చనిపోయినప్పుడు కులమేదో తెలియని దత్తపుత్రుడితో తలకొరివి ఎలా పెట్టిస్తారని పెద్దలు తీర్మానిస్తే... తనే పాడె ముందు నిప్పుల కుండతో నడిచి భర్త అంత్యక్రియలు పూర్తి చేశారు.
నేడు టీచర్స్డే. టీచ ర్స్డే అంటే మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గుర్తొస్తారు. అబ్దుల్ కలామ్ గుర్తొస్తారు. ఇంకా గొప్పగొప్పవాళ్లు గుర్తొస్తారు. వీళ్లందరికన్నా ముందు మనకు గుర్తుకు రావలసింది... సావిత్రీబాయి ఫూలె. ఇంట్లో అమ్మ మన తొలి టీచర్. భరతమాతకే తొలి టీచర్ సావిత్రమ్మ. తల్లీ నీ పాదాలకు ప్రణామం.
సావిత్రీబాయి ఫూలె (66)
తొలి భారతీయ మహిళా టీచర్, కవయిత్రి
జననం : 3 జనవరి 1831
జన్మస్థలం : నైగావ్, సతారా జిల్లా (మహారాష్ట్ర)
తల్లిదండ్రులు : లక్ష్మి, ఖాండోజీ నేవ్సే
సామాజిక వర్గం : ‘మాలి’ (నిమ్నకులం)
భర్త : జ్యోతీరావ్ ఫూలె (వివాహం 1840)
సంతానం : యశ్వంత్ (దత్తపుత్రుడు)
కృషి చేసిన అంశాలు : స్త్రీవిద్య, కుల నిర్మూలన, లైంగిక వివక్ష సంఘ సంస్కరణ తొలి మహిళా
పాఠశాల స్థాపన : 1848 (భిదేవాడ, పుణె)
మరణం : 10 మార్చి 1897
అవార్డులు - పురస్కారాలు
►{బిటిష్ ప్రభుత్వం ‘బెస్ట్ టీచర్’ అవార్డుతో గౌరవించింది.
►మహారాష్ట్ర ప్రభుత్వం ‘రాష్ట్రమాత’గా (మదర్ ఆఫ్ ది నేషన్) కీర్తించింది.
►సావిత్రీబాయి కవితలు ఆమె మరణానంతరం కావ్య ఫూలే (1934), భావన్ కశి సుబోధ్ రత్నాకర్ (1982) అనే రెండు సంపుటాలుగా వచ్చాయి. కావ్య ఫూలె తొలి ముద్రణ ఆమె జీవించి ఉన్నప్పుడే 1854లో వెలువడింది.
► 1998లో భారత ప్రభుత్వం సావిత్రీబాయి ఫూలె సంస్మరణార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది.
► ‘యూనివర్శిటీ ఆఫ్ పుణె’ పేరును భారత ప్రభుత్వం 2015లో ‘సావిత్రీబాయి ఫూలె పుణె యూనివర్శిటీ’గా మార్చింది.
►సావిత్రీబాయికి, ఆమె భర్త జ్యోతీరావు ఫూలెకు ‘భారతరత్న’ అవార్డు ఇవ్వాలని మహరాష్ట్ర ఎంపీ గత ఏడాది మార్చిలో పార్లమెంటులో డిమాండు చేశారు.
మాధవ్ శింగరాజు