కనుమరుగవుతున్నాయి.. కాపాడుకుంటే మేలు

Special story On Endangered Creatures - Sakshi

సాక్షి,  కెరమెరి(ఆసిఫాబాద్‌): భూమిపై జీవించే హక్కు ప్రతి ప్రాణికి ఉంది. మానవ మనుగడకు జీవజాతుల అవసరం కీలకం. చీమ, పేడపురుగు, సీతాకోక చిలుక, నక్క, ఉడుము, కాకి, గబ్బిలం ఇలా ఎన్నో జీవులు ప్రత్యేకంగానో.. పరోక్షంగానో.. మానవ ప్రయోజనకారులు . మారుతన్న జీవన విధానంతో జీవ వైవిధ్యానికి కీడు కలిగిస్తోంది. కొన్ని జాతులు వేట గాళ్ల బారీన పడి కనుమరుగవుతుంటే... మరికొన్ని సహజంగా క్షీణదశకు చేరుకుంటున్నాయి. మితిమీరిన రసాయనాల వాడకం, ఆధునిక సమాచారల వ్యవస్థలతో కొన్ని జీవజాతులు కనుమరుగవుతున్నాయి. అందుకే అంతాకలిసి వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.    

మాయమవుతున్న ఉడుములు..!
ఉడుములు అన్ని ప్రాంతాల్లోనూ సంచరిస్తుంటాయి. వీటిని శాస్త్రీయంగా వెరానస్‌ బెంగా లెన్సిస్‌ అంటారు. ఇవి సుమారు మూడున్నర కిలోల బరువు వరకు ఉంటాయి. భూమిలో బొరియాలు చేసి గుడ్లు పెట్టి వాటిని మట్టితో కప్పి వేయడం వీటి ప్రత్యేకత. ఇవి పంటలకు హానీ చేసే కీటకాలను ఆహారంగా తీసుకొని ప్రయోజనకారిగా ఉంటాయి. వీటి మాంసం నడుంనొప్పులను తగ్గిస్తుందనే ఓ నమ్మకం ప్రచారంలో ఉంది. దీంతో వేటగాళ్లు వీటికి ఉచ్చులు వేసి పట్టుకొని విక్రయిస్తుంటారు.

తూనిగలు కనుమరుగు...
గుండ్రటి తల.. పొడవాటి రెక్కలు.. తోక చిన్నరకం హెలికాప్టర్‌ ఉండే తూనిగలను చూస్తే అందరికీ ముచ్చటేస్తోంది. చిన్నప్పుడు ప్రతీ ఒక్కరూ వాటితో ఆడుకునే ఉంటారు. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్న వెంటనే తూనిగలు గుంపులుగుంపులు చేరి గాల్లో ఎగురుతు కనిపిస్తాయి. నిజానికి ఇవి కీటకాలను తినే మాంసాహారులు వీటి జీవితంలో తక్కువ కాలం నీటిలో సయాడ్‌ అనే లార్వా రూపంలో ఉంటూ దోమగుడ్లను ఆహారంగా తీసుకొని దోమల నివారణకు ఉపయోగపడుతుంటాయి. ఫైడా తూనిగలు దోమలను, పంటలకు నష్టం కలిగించే శుత్రు పురుగులను తిని రైతులకు మేలు చేస్తాయి. రసాయాన ఎరువులు, పురుగు మందులు నీటి కాలుష్యంతో ప్రస్తుతం తూనిగలు కనుమరుగవుతున్నాయి. 

వాన పాముల.. భూమి పుత్రులు..!
వానపాములు భూమిని సారవంతం చేస్తాయి. కొన్ని వేల సంఖ్యలో భూమి పై పొరల్లో ఉండి కంపోస్టును తయారు చేస్తాయి. ఇవి నేలలో బొరియాలు చేయడంతో నీటిని నిల్వ చేసుకునే శక్తి పెరుగుతోంది. వానపాము విషర్జకంలో నత్రజని సహజంగా ఉంటుంది. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం పెరిగి నేలలో వానపాములు చనిపోతున్నాయి. దీంతో నేలకు అవసరమయ్యే జీవద్రవం అందక గట్టిపడి పోతున్నాయి.  

కూలుతున్న పిచ్చుక గూడు.. !
గూడు కట్టుకోవడం అన్ని పక్షులది ఒక తీరైతే పిచ్చుకల గూడుది మరో ప్రత్యేకత. ఇవి ఇంజనీరింగ్‌ ప్రతిభ మాదరిగా.. ఈత, తుమ్మ, తాటి చెట్ల కొమ్మలకు చివరన గూల్లు కట్టుకుంటాయి. ఒకటే పొడవు ఉన్న గడ్డి పోచలను ముక్కున కరచి తెచ్చుకుని అత్యంత నైపుణ్యంతో గూళ్లను కట్టి ఆడపక్షిని ఆకర్శిస్తాయి.  గూడు లోపల వెచ్చగా ఉండడంతో వాన వచ్చిన తడవక పోవడం దీని ప్రత్యేకత. ఇవి కూడ కీటకాలను అదుపులో ఉంచుతాయి. 

గుంట నక్క జిత్తులేవి..?
ఇప్పటికే మన పరిసరాల్లో తోడేలు కనిపించడం లేదు. ఇక జిత్తులతో అందరిని అబ్బుర పరిచే టక్కులమారి గుంటనక్క ఆపదలో పడిపోయింది. వీటిని శాస్త్రియంగా ఉల్ప్‌స్‌ బెంగాలెన్సిస్‌ అంటారు. ఇవి భూమి లోపల రెండు నుంచి మూడు భూమి లోతులో గుంటలు చేసుకుని జీవిస్తాయి. చిన్న జంతువులు ఎలుకలు, పందికొక్కులు, పీతలు, కీటకాలను ఆహారంగా తీసుకొని వ్యవసాయ రంగానికి సహాకరిస్తాయి. రెల్లు దుబ్బలు వంటి వాటి ఆవాసాలను నాశనం చేయడం, పురుగుల మందుల ప్రభావంతో ఈ జాతి అంతరించి పోతుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top