
ఒక వరుస
డబ్బున్న వాళ్ల పిల్లలు సెలవుల్లో లోకం చుట్టి వస్తారు. డబ్బులేని వాళ్ల పిల్లలు తాతయ్య, అమ్మమ్మల ఇంటి పెరడు చుట్టూ తిరిగి వస్తారు - అంటారు మొకొకోమా మొఖోనోవానా.
దైవికం
డబ్బున్న వాళ్ల పిల్లలు సెలవుల్లో లోకం చుట్టి వస్తారు. డబ్బులేని వాళ్ల పిల్లలు తాతయ్య, అమ్మమ్మల ఇంటి పెరడు చుట్టూ తిరిగి వస్తారు - అంటారు మొకొకోమా మొఖోనోవానా. దక్షిణాఫ్రికాలో ఈయనో సోషల్ క్రిటిక్. సామాజిక ధోరణుల విమర్శకుడన్నమాట. ‘అఫోరిస్టు’గా కూడా మొకొకోమాకు మంచి పేరు. ఐర్లండ్ రచయిత, కవి అయిన ఆస్కార్ వైల్డ్లా ఈయన కూడా సమాజంలోని అసమానతల్లోంచి చక్కటి జీవిత సత్యాలను వెలికి తీసి తగలాల్సినవాళ్లకు తగిలేలా వాటిని పుల్లవిరుపుగా సంధిస్తుంటారు. అఫోరిస్టు అంటే... ఇదిగో ఇలాగే జీవితాన్ని కాచి, వాస్తవాలను వడబోసి, ఎండగట్టేవాడని.
సమాజంలో ఎప్పటికీ అంతరించిపోని అసమానతలు కొన్ని ఉంటాయి. మొకొకోమా చెప్పినట్లు బాల్యం నుంచే అవి మనుషుల్ని వేరు చేసి వేర్వేరు గదుల్లో పెట్టేస్తాయి. ఉన్నవాళ్లు, లేనివాళ్లు; అగ్రవర్ణాలవాళ్లు, కులం తక్కువవాళ్లు.. ఇలా రకరకాల గదులు. ఆ గదుల్లోనే పిల్లలు పెరిగి పెద్దవాళ్లయి, ఆ గదుల్లోంచే ప్రపంచాన్ని చూడ్డానికి అలవాటు పడతారు. ప్రపంచం అంటే అదేనని అనుకుంటారు. అందుకే మనుషులు భిన్న ప్రపంచాల మధ్య సన్నటి రేఖలా ఉండే ఆదర్శ ప్రపంచాన్ని చూడలేకపోతున్నారేమో!
ఎలా మరి సమాజంలో ఈ అసమానతలు తొలగిపోవడం? సంఘ సంస్కర్తలు, మానవతావాదులు ప్రతి తరంలోనూ ఎంతోకొంత ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ గదుల గోడల్ని కూల్చేసి అందర్నీ ఒక చోట ఉంచే సమానత్వం సాధ్యం కావడం లేదు. సమానత్వం అంటే.. జేబులో వెయ్యి నోటు ఉన్నవాడు, తన ఎదురుగా ఉన్నది పూటకు గతిలేనివాడని తెలిసికూడా మనిషిగా అతడిని గౌరవించడం. సమానత్వం అంటే.. తక్కువ కులం వాళ్లను అగ్రకులాల వాళ్లు తమ గ్లాసుల్లో తాగనివ్వడం మాత్రమే కాదు, వాళ్లు తాగిన గ్లాసులతోనే మళ్లీ వీళ్లు తాగడం. ఇంతటి సమానత్వం ఏనాటికైనా సాధ్యం అవుతుందా?
తమిళనాడులో కృష్ణగిరి అనే జిల్లా ఉంది. ఆ జిల్లాలో అనేక గ్రామాలు ఉన్నాయి. బడి ఎగ్గొట్టే పిల్లాడిలా ఈ ఏడాది ఆ గ్రామాలన్నిటినీ తప్పించుకుని తిరిగాడు వరుణదేవుడు. ప్రతిరోజూ ఆబ్సెంటే. ఎక్కడా చుక్కనీరు లేదు. శూలగిరి అనే గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల ఐదు ఊళ్లలో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. దాంతో ఈ ఆరు గ్రామాల ప్రజలకు మళై రాయప్పసామి మీద కోపం వచ్చింది.
రాయప్పసామి వాళ్ల వానదేవుడు. ఆ దేవుడి మీద వాళ్లకు కోపం అయితే వచ్చింది కానీ వెంటనే భయం కూడా వేసింది. కోపం మనకు రావడం ఏమిటి? ఆయనకే కోపం వచ్చినట్లుంది. అందుకే వర్షాలు కురవడం లేదు అనుకుని ఆయన్ని శాంతపరిచే కార్యక్రమాన్ని తలపెట్టారు. శూలగిరిలో అగ్రవర్ణాలవారు, దళితులు అన్న తేడా లేకుండా అంతా కలసి సమైక్యంగా ఊరుమ్మడి పూజకు ఏర్పాట్లు చేశారు. పూజ ప్రారంభంలో ఓ మహిళకు పూనకం వచ్చింది. అక్కడ ఉన్న ఓ పద్దెనిమిదేళ్ల యువకుడి వైపు వేలు చూపిస్తూ ఇతడే ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించాలి.
ఇతడే గర్భగుడిలో పూజలు కూడా నిర్వహించాలి, ఇది రాయప్పసామి ఆదేశం అని చెప్పింది. విశేషం ఏమిటంటే ఆ యువకుడు ఓ దళితుడు. అంతకన్నా విశేషం ఏమిటంటే.. ఆ ఊళ్లన్నీ నేటికీ అంటరానితనం పాటిస్తున్నవే. అయినప్పటికీ రాయప్పసామి ఉత్సవ విగ్రహాన్ని ఆ యువకుడి తలపై పెట్టించి గ్రామంలో స్వామి వారిని ఊరేగించారు. ఆ యువకుడి చేత ఆలయ పూజలు చేయించారు. ఒకప్పుడు అతడికి ఆలయ ప్రవేశం నిరాకరించిన శూలగిరి ఇప్పుడు అదే యువకుడి చేతుల మీదుగా దైవప్రసాదాలను కళ్లకు అద్దుకుని మరీ స్వీకరించింది.
సమాజంలోని అసమానతలు తొలగిపోవడం ఏనాటికైనా సాధ్యమేనా? అనే ప్రశ్నకు ఈ సంఘటన సమాధానం కాదు. ఇది ఒక సంఘటన మాత్రమే. అంతకు మించి ప్రాధాన్యం గానీ, అది చూపించే ప్రభావంగానీ ఏమీ ఉండకపోవచ్చు కూడా. పూజ ఫలితంగా శూలగిరి చుట్టుపక్కల బాగా వర్షాలు పడ్డాయనే అనుకుందాం. అప్పుడు ఎండిన భూములు చిగురిస్తాయేమో కానీ, దేవుడు వాన కురిపించాడు కదా అని అగ్రవర్ణాల వారు, దళితులపై ప్రత్యేకంగా ప్రేమను కురిపిస్తారని అనుకోలేం. పంటలు పండి, కోతలకొచ్చాక మళ్లీ మామూలే. ఎవరి గదుల్లోకి వాళ్లు. ఎవరి గ్లాసులతో వాళ్లు!
‘‘ఇదంతా కాదండీ, యుద్ధాలో, విలయాలో, విపత్తులో రావాలి... సమాజంలో ఈ అంతరాలు అంతరించిపోయేందుకు’’ అంటుంటారు సహనం నశించిన సంస్కరణవాదులు కొందరు. మనుషులు కట్టుకున్న అడ్డుగోడలను కూల్చేసి అందరినీ ఏకం చేస్తాయని చెప్పి యుద్ధాలను, విలయాలను, విపత్తులను ఆహ్వానించలేం కదా. ఆ యుద్ధమో, విలయమో, విపత్తో లోపలి నుంచి ఒక వ్యక్తిగత మానసిక సంఘర్షణగా మనలో సంభవిస్తే చాలు. ఆ ఘర్షణలోంచి మనిషిని మనిషి చేసుకునే గాఢ ఆలింగనంలో మానవ ప్రమేయాలకు అతీతమైన ఒక దైవాంశ ఉంటుంది. అది చాలదా మనుషులందరినీ ఒక వరుసగా చక్కబెట్టేందుకు.
- మాధవ్ శింగరాజు