అందరికీ మంచండీ | Ayuta Chandi Maha Yagam | Sakshi
Sakshi News home page

అందరికీ మంచండీ

Dec 27 2015 4:58 AM | Updated on Sep 15 2018 7:34 PM

అందరికీ మంచండీ - Sakshi

అందరికీ మంచండీ

పూర్వం రాజులు, చక్రవర్తులు ప్రజాక్షేమం కోసం రకరకాల యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేసేవారు.

అయుత చండీ మహాయాగం
పూర్వం రాజులు, చక్రవర్తులు ప్రజాక్షేమం కోసం రకరకాల యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేసేవారు. అలా చేయడం వల్ల సర్వజనులకు హితం కలిగేది. ఎందుకంటే శాస్త్ర ప్రమాణంగా హోమద్రవ్యాలను సరియైన పద్ధతిలో అగ్నికి ఆహుతిచ్చినప్పుడు, అవి నేరుగా సూర్యుడికి చేరతాయి. ఆ సూర్యుడి నుంచి వర్షాలు, ఆ వర్షాల నుంచీ పాడిపంటలు... అంటే అన్నం లభిస్తాయి. తత్ఫలితంగా సకల జనులు సుభిక్షంగా ఉంటారని వేదం చెబుతోంది.

ఇక చండీ హోమానికి సంబంధించి నవచండీయాగం, శతచండీయాగం, సహస్ర చండీయాగం, అయుత చండీయాగం, లక్ష చండీయాగం ఉన్నాయి. ఇవన్నీ కూడా మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అమ్మవార్లందరికీ కలిపి నిర్వహించేవి.
 
నవచండీయాగం: ఒక్కరోజులో చేసే యాగం. శతచండీయాగం: ఇది ఐదురోజులు చేసే యాగం. సహస్ర చండీయాగం: ఇది ఐదురోజులు చేసే యాగం. అయుత చండీ మహాయాగం: గురు ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవచనం చేసి ఈ మహాయాగం నిర్విఘ్నంగా జరగడానికి మహాగణపతికి అధర్వవేదోక్త రీతిగా సహస్రమోదక హోమాన్ని నిర్వహిస్తారు. తిరిగి గణపతిపూజ, పుణ్యాఃవచనం చేసి దేవనాంది, అంకురారోహణ, ఋత్విగ్వరణం చేస్తారు. కలశ స్థాపన, దీప స్థాపన, చండీ యంత్ర స్థాపన, కలశంలో, యంత్రంలో దేవతా ఆవాహన, ప్రాణప్రతిష్ఠ చేస్తారు.
 
ఇది ఐదు రోజులు చేసే యాగం. 1000 మంది ఋత్విక్కులుంటారు. మొదటి నాలుగు రోజులల్లో ప్రతిరోజూ నవావరణ పూజ, చతుష్టష్టి యోగినీ దేవతల పూజ, దీపసహిత బలి, కల్పోక్త పూజతో పాటూ కుంకుమార్చన కూడా చేస్తారు. ఇవిగాక అవధారలు చేస్తారు. ఆఖరి రోజు - అగ్ని ప్రతిష్ట చేసి 70 లక్షల ఆహూతులతో (అయుతం అంటే 10 వేలు. సప్తశతి అంటే 700:10000), అమ్మవారికి పరమాన్న ద్రవంతో, 10 లక్షల నవార్ణ మంత్రాలతో ఆజ్యహోమం, అంగ, ఆవరణ, పీఠ దేవతలకు ఆజ్యహోమం, తర్పణం చేసి ఇంద్ర శక్త్యాది దేవతలకు బలిదానం, పూర్ణాహుతి, దంపతి, సువాసిని, కన్యక పూజలు జరిపి అవభృతం చేస్తారు.

తర్వాత యాగసమాప్తి చేస్తారు.  తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. ‘హుతసంఖ్యా సమానంస్యాత్ ఉత్తమం ద్విజభోజనం’... అంటే ఎన్ని ఆహూతులు అగ్నికి సమర్పణ చేస్తున్నామో అంతమందికి అన్న సమర్పణ చేయడం మంచిది. ఇది అమ్మవారిని, వారి గణాలను సంతృప్తిపరచడానికి చేస్తారు.
 ఈ ఐదు రోజుల్లో ప్రతిరోజూ చతుర్వేద స్వాహాకారాలు (అంటే నాలుగు వేదాల్లోని ప్రతి ఒక్క మంత్రంతో హోమం), దుర్గా హోమం, శ్రీసూక్త హోమం, గౌరీ హోమం, సరస్వతీ హోమం, మహాసౌరం, ముత్తయిదువులతో కుంకుమార్చనలు జరుగుతాయి.
 
ఈ హోమాన్ని 100 హోమకుండాలతో చేస్తారు.దీనిలో 100 సృక్‌లు, 1000 సృవలతో చేస్తారు. 4 వేల కిలోల బియ్యం, 4 వేల కిలోల నెయ్యి తదితరాలతో శాస్త్ర ప్రమాణంగా నిర్ణయించిన హోమద్రవ్యాలను ఉపయోగిస్తారు.
 
చండికాదేవి ప్రాధాన్యత
చండికాదేవి చాలా ఉగ్ర స్వరూపంతో ఉంటుందని అపోహ పడుతుంటాం. అమ్మ కోపం ధర్మగ్రహం. పిల్లలను సన్మార్గంలో నడిపే తల్లి చూపే కోపం లాంటిదే అమ్మ కోపం. అమ్మ అనుగ్రహం పొందడానికి మరో ప్రధాన కారణం ఉంది. చండీ దేవత చాలా ప్రచండ శక్తి. ఒక్క భూగ్రహమే కాకుండా విశ్వాంతరాళాలలోని సమస్త శక్తులూ ఆమెను అంటిపెట్టుకుని ఉంటాయి. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయమయిపోవడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యత. ఎక్కడైతే చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు, దుఃఖం అనేది రాదు, ఆ ప్రాంతంలో అకాలమరణాలుండవు.
 
అతః సర్వార్థలాభాయ చండికాం బ్రహ్మరూపిణీ ఆరాధయేత్ పరాంశక్తిం స్వర్గస్థిత్యంతకారిణీం. లోక కళ్యాణార్థం, సర్వజనుల హితార్థం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది.

తన్మాచ్ఛక్తిః సదాసేవ్యా విద్వద్భిఃకృతనిశ్చయైః
ధర్మార్థకామమోక్షాణాం స్వామినీ సా మహోదయా
 ఆ జగన్మాత ధర్మార్థ కామమోక్షాలను ఇస్తుంది కనుక, ఆమెను ఆరాధించడం, హోమం చేయడం శుభస్కరం, శ్రేయస్కరం, యశస్కరం, శత్రు నాశకరం. హోమాన్ని చూసినా, విన్నా, తెలుసుకున్నా హితం కలుగుతుందని పెద్దల వాక్కు. సర్వేజనాస్సుఖినోభవంతు
 - గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంకశర్మ
 అయుత చండీ మహాయాగ ఋత్విజులు
 
ఫలం ఏమిటి?
యజ్ఞయాగాదులు ఆచరించటం వల్ల మనం కోరిన కోరికలు అన్నీ సిద్ధించకపోవచ్చును గానీ, ప్రకృతికి ఏది అవసరమో అవి తప్పనిసరిగా ప్రాప్తిస్తాయి. ఆవునేతితో హోమం చేస్తే ప్రాణ వాయువు (ఆక్సిజన్) పెరుగుతుంది. హోమంలో ఉపయోగించే వివిధ ద్రవ్యాల వల్ల ప్రకృతిలోని సమస్త మూలకణాలూ శుద్ధి అయి, జీవశక్తి పెరుగుతుంది.

యాగం లేదా హోమం జరిగినచోటే గాక హోమధూమం వెళ్ళినచోటల్లా స్వచ్ఛమైన గాలి ఉంటుంది. భూగర్భజలాలు పైకి అందుతాయి. భూమిలో ఖనిజ శక్తి పెరుగుతుంది. సకాల వర్షాలు పడతాయి. జీవజాతులలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. హానికర సూక్ష్మక్రిములు (బాక్టీరియా) ఉండవు. ఆవులు, గేదెలు పాలు ఎక్కువ ఇస్తాయి. పాలలో పోషకవిలువలు పెరుగుతాయి. సస్య వృద్ధి (పంటలు) కలుగుతుంది.

ఆ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్లు తగ్గి సహజమైన కాన్పులు కలుగుతాయి. ప్రమాదాలు తగ్గుతాయి. మానవుడికి చెడు ఆలోచనలు రావు. మానవుల కనీస అవసరాలు తీరతాయని శ్రుతి (వేదం) చెప్తున్నది. ఇది శాస్త్రీయ పరిశోధనద్వారా నిరూపితం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement