
రైతుల కోసం ప్రారంభించనున్న టీవీ చానల్?
అవస్థాపనా సౌకర్యాలైన రవాణా, సమాచారం, నౌకాశ్రయాలు, ఇంజనీరింగ్ పరిశ్రమలు, విద్యుత్, రోడ్ల అభివృద్ధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది.
ప్రభుత్వ వ్యయ నియమాలు - వర్గీకరణ
అవస్థాపనా సౌకర్యాలైన రవాణా, సమాచారం, నౌకాశ్రయాలు, ఇంజనీరింగ్ పరిశ్రమలు, విద్యుత్, రోడ్ల అభివృద్ధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత పెంపునకు ఈ రంగాల అభివృద్ధి తప్పనిసరి. ఆయా రంగాలపై పెట్టుబడులు మార్కెట్ పరిధిని విస్తృత పర్చడానికి, శ్రామిక ఉత్పాదకత పెంపునకు, ఉత్పత్తి వ్యయాల తగ్గుదలకు దోహదపడతాయి. కోశ విధాన సాధనమైన ప్రభుత్వ వ్యయం అనే అంశం ఆర్థికాభివృద్ధి లక్ష్యసాధనకు అవసరమైన ఓవర్హెడ్ క్యాపిటల్ అందిస్తుంది.
ప్రభుత్వ వ్యయం రెండు రకాలు:
* నీటిపారుదల, రోడ్లు లాంటి ప్రాజెక్టులపై ప్రత్యక్ష పెట్టుబడి
* కొన్ని వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి గ్రాంట్లు, సబ్సిడీలను అందించడం.
ఈ రెండు విధాలైన ప్రభుత్వ వ్యయం గ్రామీణ రంగంలో ఆర్థికవృద్ధిని పెంపొందించడానికి దోహదపడుతుంది. ప్రభుత్వ బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని మిసెస్ హిక్స్ ప్రభుత్వ వ్యయాన్ని కింది విధంగా వర్గీకరించారు.
* రక్షణ వ్యయం: డిఫెన్స (రక్షణ) పరికరాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స సిబ్బంది వేతనాలు ఈ వ్యయంలో భాగం. విదేశీ దురాక్రమణల నుంచి దేశంలోని పౌరులకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ఈ వ్యయం చేస్తుంది.
సివిల్ వ్యయం: దేశంలో శాంతిభద్రతలు కాపాడటం, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్కు సంబంధించి ప్రభుత్వ వ్యయం.
అభివృద్ధి వ్యయం: వ్యవసాయం, పారిశ్రామిక రంగం, వాణిజ్యం, రవాణా, సమాచార రంగాలపై వ్యయం.
అన్ని రకాల ప్రభుత్వ వ్యయం ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనమా?
ప్రభుత్వ వ్యయాన్ని సక్రమంగా వినియోగిస్తే ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వ వ్యయానికి కింది లక్షణాలు ఉండాలి.
* ఉత్పాదకతను కలిగి అభివృద్ధి నిమిత్తం వినియోగించాలి.
* ప్రభుత్వ వ్యయానికి సంబంధిత అథారిటీ అనుమతి తప్పనిసరి.
* నిర్దేశిత ద్రవ్యాన్ని సక్రమంగా వినియోగించారో లేదో తెలుసుకోవడానికి ఆడిట్ తప్పనిసరిగా నిర్వహించాలి.
* అందరికీ ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలకు ప్రభుత్వం వ్యయం చేయాలి.
* ఆర్థిక వ్యవస్థలో సరళత్వాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ వ్యయ విధానంలో మార్పులను సూచించే విధంగా ఉండాలి.
ఆధునిక ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ వ్యయం పాత్ర ప్రధానమైంది. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి స్థిరత్వం సాధించడానికి ఇది ఉపకరిస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధనకు కింది విధంగా దోహదపడుతుంది.
* వేగవంతమైన ఆర్థికాభివృద్ధి
* వాణిజ్యం, వ్యాపారాన్ని ప్రోత్సహించడం
* గ్రామీణాభివృద్ధి
* ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి
* వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి
* రోడ్లు, రైల్వే, శక్తిలాంటి అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి
* బొగ్గు, చమురు ఖనిజ వనరుల వెలికితీత, అభివృద్ధి.
* పూర్తి స్థాయి ఉద్యోగిత ద్వారా ధరల స్థిరత్వం సాధించటం
* ఆదాయ పంపిణీలో సమానత
* ప్రజాశ్రేయస్సుకు ప్రాధాన్యమివ్వడం.
ప్రభుత్వ వ్యయం పెరుగుదలకు కారణాలు
* ప్రణాళికా యుగంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వ్యయం గణనీయంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యయం సుమారు పదిరెట్లైంది. 1990-91లో ఇది రూ. 98,272 కోట్లు కాగా, 2012-13లో రూ. 14,10,372 కోట్లకు చేరింది. 2014-15 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని రూ. 17,94,892 కోట్లుగా ప్రతిపాదించారు.
* జనాభావృద్ధి అధికంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు తమ విధులను విస్తృత పర్చాలి. దాంతో విద్య, ఆరోగ్యం, సబ్సిడీలు, సాంఘిక భద్రత, అవస్థాపనా సౌకర్యాలపై ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది.
* స్వాతంత్య్రానంతరం రక్షణ రంగ వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. దీని కారణంగా విదేశాల నుంచి ఎదురయ్యే సమస్యలు తగ్గుముఖం పట్టాయి. దేశంలో సాంఘిక, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి అనువైన వాతావరణం ఏర్పడింది. 1990-91లో రక్షణ వ్యయం రూ. 10,874 కోట్ల నుంచి 2012-13లో రూ. 1,81,776 కోట్లకు పెరిగింది. 2014-15 బడ్జెట్లో రక్షణ రంగ వ్యయాన్ని రూ. 2,29,000 కోట్లుగా ప్రతిపాదించారు.
* స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ రాబడికంటే వ్యయం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వానికి రుణభారం పెరిగింది. తద్వారా వడ్డీ చెల్లింపులు అధికమయ్యాయి. అనేక ప్రభుత్వ కార్యకలాపాలకయ్యే వ్యయంలో పెరుగుదల కారణంగా ప్రభుత్వం స్వదేశీ మార్కెట్ నుంచి, బహిర్గత ఆధారాల ద్వారా రుణాన్ని సమీకరించింది. ఈ క్రమంలో 1990-91లో కేంద్ర ప్రభుత్వ వడ్డీ చెల్లింపుల వ్యయం రూ.21,498 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం క్రమంగా పెరుగుతూ 2012-13లో రూ.3,13,170 కోట్లకు చేరుకుంది. 2014-15 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లింపులపై వ్యయాన్ని రూ. 4,27,011 కోట్లుగా ప్రతిపాదించింది.
* కేంద్ర ప్రభుత్వం ఆహారం, ఎరువులు, ఇంధనం, విద్యా రంగాలకు సంబంధించి అనేక విధాలైన సబ్సిడీలనందిస్తోంది. అధిక సబ్సిడీ వ్యయం కారణంగా ప్రభుత్వ వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. 1990-91లో సబ్సిడీలపై వ్యయం రూ. 9581 కోట్లు కాగా 2012-13లో రూ. 2,57,079 కోట్లకు చేరింది. 2014-15 బడ్జెట్లో సబ్సిడీలపై వ్యయాన్ని రూ. 2,60,658 కోట్లుగా ప్రతిపాదించారు.
* పెరుగుతున్న జనాభా, ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో సాధారణ పరిపాలనపై కేంద్ర ప్రభుత్వ వ్యయం అధికమైంది. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్పై ఎక్కువగా వ్యయం చేయాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం వల్ల ప్రభుత్వం వేతన స్కేళ్లను సవరించడం, ప్రభుత్వ వస్తు, సేవల ఉత్పత్తికి ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావడం కారణంగా ప్రభుత్వ వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఏర్పడుతోంది.
* ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే క్రమంలో ఆధునిక ప్రభుత్వాలు ప్రణాళికా రచన ప్రారంభించాయి. భారత్లో 1951 నుంచి ప్రణాళికా యుగం ప్రారంభమైంది. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్ర కీలకమైనందు వల్ల వివిధ రంగాలపై ప్రభుత్వ వ్యయం పెరిగింది.
* పట్టణీకరణ కారణంగా సివిల్ అడ్మినిస్ట్రేషన్పై వ్యయం పెరిగింది. కోర్టులు, పోలీస్, రవాణా, రైల్వేలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రజారోగ్యం, నీరు, విద్యుత్ సరఫరా, పబ్లిక్ పార్కులు, లైబ్రరీలపై ఖర్చు ఎక్కువైంది.
* స్వాతంత్య్రానంతరం ప్రభుత్వానికి పన్ను, పన్నేతర రాబడి అధికమైన కారణంగా ప్రభుత్వ రాబడి పెరిగింది. దాంతో జాతీయాదాయం పెరిగింది. దీనికి అనుగుణంగా వ్యయాన్ని పెంచారు. 1950 -51లో ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద ఎన్ఎన్పీ 1999-2000ధరల వద్ద రూ. 2,04,924 కోట్ల నుంచి 2013-14లో 2004-05 ధరల వద్ద రూ. 49,20,183 కోట్లకు పెరిగింది.
ఝ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన కార్యక్రమాలపై అధిక వ్యయం చేస్తున్నాయి. వీటితోపాటు ప్రజా సంక్షేమం దృష్ట్యా అనేక సాంఘిక భద్రతా చర్యలను చేపట్టాయి. భారత్లోనూ వీటిపై ఎక్కువ వ్యయం చేస్తున్నారు.
ప్రభుత్వ వ్యయ వర్గీకరణ మూలధన, రెవెన్యూ వ్యయం:
మూలధన వ్యయం స్థిర ఆస్తుల కల్పనకు దారితీస్తుంది. ఈ వ్యయం పెట్టుబడుల రూపంలో ఉంటుంది. నికర ఉత్పాదక ఆస్తుల పెరుగుదలకు పెట్టుబడులు దోహదపడతాయి. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి మూలధన వ్యయం ఉపయోగపడుతున్నందువల్ల ఈ వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా పరిగణించవచ్చు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు చేసేదే మూ లధన వ్యయం. రెవెన్యూ వ్యయాన్ని ప్రస్తుత లేదా వినియోగ వ్యయంగా భావించవచ్చు. ఈ వ్యయాన్ని సివిల్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స బలగా లు, ప్రజారోగ్యం, విద్య, ప్రభుత్వ యంత్రాంగం నిర్వహణకు వినియోగిస్తారు. స్వాతంత్య్రానంతరం రెవెన్యూ వ్యయంలో పెరుగుదల ఏర్పడింది.
అభివృద్ధి లేదా అభివృద్ధేతర వ్యయం:
అవస్థాపనా సౌకర్యాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఈ క్రమంలో వివిధ రంగాలపై జరిగిన వ్యయాన్ని అభివృద్ధి (ఉత్పాదక) వ్యయంగా వర్గీకరించవచ్చు. అభివృద్ధేతర (అనుత్పాదక) వ్యయం ద్వారా ప్రభుత్వానికి ఏవిధమైన ఆదాయం లభించదు. వడ్డీ చెల్లింపులు, శాంతి భద్రతలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లపై జరిగే వ్యయం ద్వారా ఏవిధమైన ఉత్పాదక ఆస్తుల కల్పన ఉండదు.
బదిలీ, బదిలీ చేయడానికి వీలులేని వ్యయం:
జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, నిరుద్యోగ భృతి, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం అమలుపర్చే సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాన్ని బదిలీ వ్యయంగా భావించవచ్చు. దీనివల్ల సమాజంలో ఆదాయ పునఃపంపిణీ జరుగుతుంది. మరోవైపు బదిలీ చేయడానికి వీలులేని వ్యయం వల్ల ఆదాయం లేదా ఉత్పత్తి సృష్టి జరుగుతుంది. ఈ వ్యయంలో అభివృద్ధి, అభివృద్ధేతర వ్యయం కలిసి ఉంటుంది. ఆర్థిక అవస్థాపనలు (శక్తి, రవాణా, నీటిపారుదల), సాంఘిక అవస్థాపనలు (విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం), అంతర్గత శాంతి భద్రతలు, రక్షణ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్పై ఈ వ్యయం జరుగుతుంది. దీని వల్ల ఆర్థిక కార్యకలాపాల పెంపునకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది.
ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం:
పంచవర్ష ప్రణాళికలకు సంబంధించిన వివిధ అంశాలపై జరిగే వ్యయం ప్రణాళికా వ్యయం. బడ్జెట్ ద్వారా వివిధ రంగాలపై కేంద్ర ప్రభుత్వం ఈ వ్యయాన్ని చేస్తుంది. ప్రణాళిక అమల్లో భాగంగా రాష్ర్ట ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే ఆర్థిక సహాయం దీనిలో భాగంగా ఉంటుంది. ప్రణాళికా వ్యయాన్ని రెవెన్యూ వ్యయం, మూలధన వ్య యంగా విభజించవచ్చు. బడ్జెట్లో ప్రభుత్వం సాధారణ కార్యకలాపాలను నిర్వహించడానికి పొందుపర్చేది. ప్రణాళికేతర వ్యయం. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు, వేతనాలు, పెన్షన్లపై ఈ వ్యయం ఉంటుంది. దీనికి పంచవర్ష ప్రణాళికలో తావులేదు. ప్రణాళికేతర వ్యయాన్ని కూడా రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంగా విభజించవచ్చు.