మీరు ఉదయమే వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్లండి అని వైద్య ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్ రావడంతో అభ్యర్థులు హుటాహుటిన ఉదయం 9 గంటలకే కార్యాలయం చేరుకున్నారు.
అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం పడిగాపులు
Dec 14 2016 12:02 AM | Updated on Sep 4 2017 10:38 PM
– ఆర్బీఎస్కే ఉద్యోగుల ఎదురుచూపులు
కర్నూలు(హాస్పిటల్): మీరు ఉదయమే వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్లండి అని వైద్య ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్ రావడంతో అభ్యర్థులు హుటాహుటిన ఉదయం 9 గంటలకే కార్యాలయం చేరుకున్నారు. కానీ కార్యాలయ ఉద్యోగులు నింపాదిగా 11 గంటలకు చేరుకున్నారు. బయట అధిక సంఖ్యలో అభ్యర్థులు ఉండటాన్ని చూసీ చూడనట్లు వెళ్లారు. మరోవైపు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే డీఎంహెచ్వో ఊళ్లో లేరని తెలిసింది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. వీరికి సరైన సమాచారం ఇచ్చేవారు లేక సాయంత్రం 4 గంటల వరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఆర్బీఎస్కే స్కీమ్ కింద మొబైల్ హెల్త్టీంలలో పనిచేసేందుకు ఇటీవల నియామకాలు చేపట్టారు. ఇందులో అల్లోపతి వైద్యులు 40, ఆయుర్వేద 20, హోమియోపతి 20 వైద్యులతో పాటు 40 మంది ఫార్మాసిస్టులు, 40 మంది ల్యాబ్టెక్నీషియన్లు, 40 మంది ఏఎన్ఎంలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ సుదీర్ఘకాలం ప్రక్రియ చేపట్టి నియామకాలు చేపట్టింది. ఎట్టకేలకు నాలుగు రోజుల క్రితం నియామకాలు పొందిన వారికి కౌన్సిలింగ్ ద్వారా వారు పనిచేసే చోటును కల్పించారు. మంగళవారం ఉదయమే వస్తే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని చెప్పారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు వచ్చినా మధ్యాహ్నం 12 గంటలైనా సమాధానం చెప్పేవారు కనిపించలేదు. చివరకు ఒంటిగంటకు ఓ ఉద్యోగి వచ్చి మీరు భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు వస్తే అప్పుడు చెబుతామంటూ పంపించేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు భోజనం కోసమని వెళ్లారు. అధికారులు ఏ విషయమై తెలపకుండా గంటల తరబడి కార్యాలయం వద్దే ఉంచుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులకు మీరు ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళితే మళ్లీ సమాచారం పంపిస్తామంటూ పంపించి వేశారు.
Advertisement
Advertisement