‘నల్ల బజార్’లో టీచర్ బదిలీలు
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కోరుకున్న పాఠశాలకు బదిలీపై వెళ్లేందుకు రూ. లక్షల్లో ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో అ«ధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు చక్రం తిప్పుతున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడి నుంచి రూ.లక్షన్నర నుంచి రూ.2.50 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్టు తెలిసింది.
* సిఫార్సు లేఖలతో సీఎం పేషీకి టీచర్ల క్యూ
* కౌన్సెలింగ్ విధానానికి తూట్లు
* పాఠశాలల్లో ఖాళీల వివరాలు కోరిన డైరెక్టరేట్
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కోరుకున్న పాఠశాలకు బదిలీపై వెళ్లేందుకు రూ. లక్షల్లో ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో అ«ధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు చక్రం తిప్పుతున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడి నుంచి రూ.లక్షన్నర నుంచి రూ.2.50 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్టు తెలిసింది.
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు పెడదోవలో పయనిస్తున్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలపై నిషేధం అమల్లో ఉండడంతో, కోరుకున్న పాఠశాలకు బదిలీపై వెళ్లేందుకు లక్షల్లో ఖర్చు పెట్టేందుకు సైతం సిద్ధమవుతున్నారు. జిల్లాలోని మంత్రులను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుని సిఫార్సు లేఖలు పొందారు. వాటితో నేరుగా సీఎం పేషీకి వెళ్లి అక్కడి నుంచి పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అధికారుల ద్వారా బదిలీపై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బదిలీలపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులను బదిలీ చేసే అధికారం కేవలం సీఎం చేతుల్లోనే ఉంటుంది. అదీ తీవ్రమైన జబ్బులు, అనారోగ్యం వంటి ప్రత్యేక పరిస్థితుల్లోనే ఉద్యోగులను ఇలా బదిలీ చేయాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా రాజకీయపరమైన ప్రయోజనాలతో బదిలీల కోసం ఆరాటపడుతున్న ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ విధానానికి ముప్పు తెస్తున్నారు. గతంలో పలుమార్లు ఈ విధంగా అక్రమ బదిలీలు నిర్వహించిన ప్రభుత్వం తాజాగా మరోసారి రాజకీయ బదిలీలకు తెర తీసింది.
వెయింటింగ్లో 200 మంది..
జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో దాదాపు 200 మంది అక్రమ బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో అధిక శాతం రాజకీయ పలుకుబడితో ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖలతో సీఎం పేషీకి వెళ్లారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు చక్రం తిప్పుతున్నారు. ఒక్కో బదిలీకి రూ.లక్షన్నర నుంచి రూ.2.50 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్టు తెలిసింది.
గుంటూరు, తెనాలి డివిజన్లకు డిమాండ్..
గుంటూరు, తెనాలి డివిజన్ల పరిధిలోని పాఠశాలలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని పాఠశాలల్లో పని చేస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది జిల్లా కేంద్రంతో పాటు తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో నివసిస్తున్న వారే. నిత్యం ఆర్టీసీ బస్సులు, రైళ్లలో వందలాది కిలోమీటర్లు ప్రయాణించి పాఠశాలలకు వెళుతున్నారు. ప్రతి యేటా ప్రభుత్వం నిర్వహిస్తున్న బదిలీల కౌన్సెలింగ్లో సీనియారిటీ ఆధారంగా కోరుకున్న పాఠశాలలకు వెళ్లలేకపోయిన వారు, జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండాలని కోరుకునే ఉపాధ్యాయుల్లో అధిక శాతం మంది అక్రమ బదిలీలపై మొగ్గు చూపుతున్నారు.
వివరాలు కోరిన ఉన్నతాధికారులు..
ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, టీచర్లు అవసరమై పాఠశాలల వివరాలు పంపాలని డీఈవోను విద్యాశాఖ ఉన్నతాధికారులు కోరారు. ఈ విధంగా ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే ఉత్తర్వులు విడుదల కానున్నాయి. పలు మండలాల్లోని ఉపాధ్యాయులు పరస్పర బదిలీలకు అంగీకారానికి వచ్చారు.