కూర వండలేదని కుమారుడి హత్య | son murdered by his father | Sakshi
Sakshi News home page

కూర వండలేదని కుమారుడి హత్య

Jul 21 2016 1:07 PM | Updated on Aug 16 2018 4:30 PM

కూర వండలేదని కుమారుడి హత్య - Sakshi

కూర వండలేదని కుమారుడి హత్య

కూర వండలేదని కుమారుడిని ఓ తండ్రి హత్య చేసిన ఘటన భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామంలో చోటు చేసుకుంది.

భూపాలపల్లి మండలంలో ఓ తండ్రి ఘాతుకం

భూపాలపల్లి: కూర వండలేదని కుమారుడిని ఓ తండ్రి హత్య చేసిన ఘటన భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక సీఐ సీహెచ్‌ రఘునందన్‌రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు సమ్మయ్య, అతని కుమారుడు దేవేందర్‌(22) కూలీ పని చేస్తుంటారు. సమ్మయ్య భార్య రెండేళ్ల క్రితం మృతి చెందగా కూతురు స్వరూపకు ఏడాది క్రితం వివాహం చేశాడు. దీంతో తండ్రీ కొడుకు ఇంట్లో ఉంటున్నారు.
 
సమ్మయ్య మంగళవారం ఉదయం కూలీ పనికి వెళ్తున్న సమయంలో కూర లేక కారంపొడి వేసుకుని భోజనం బాక్సు తీసుకెళ్లాడు. సాయంత్రానికి కూర వండమని కుమారుడు దేవేందర్‌కు డబ్బులు ఇచ్చి వెళ్లాడు. అయితే దేవేందర్‌ కూర వండకపోగా, డబ్బు ఖర్చు చేశాడు. ఇదేమిటని ప్రశ్నించగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సమ్మయ్య దేవేందర్‌ నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో తలపై మోది చంపి పరారయ్యాడు. బుధవారం ఉదయం దేవేందర్‌ను కూలీ పనికి పిలిచేందుకు గ్రామస్తులు రాగా అతడు ఇంట్లో శవమై కనిపించాడు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement