పూలంగి సేవలో నెట్టికంటుడు | nettikantudu in pulangi seva | Sakshi
Sakshi News home page

పూలంగి సేవలో నెట్టికంటుడు

May 18 2017 12:03 AM | Updated on Sep 5 2017 11:22 AM

పూలంగి సేవలో నెట్టికంటుడు

పూలంగి సేవలో నెట్టికంటుడు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

గుంతకల్లు రూరల్‌ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదురోజులపాటు సాగే ఈ ఉత్సవాలలో మొదటిరోజు స్వామివారు పూలంగి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం వేకువజామునే స్వామి మూలవిరాట్‌కు అభిషేకాలు నిర్వహించి, పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఆలయ ఈవో ఆనంద్‌కుమార్, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యుల చేతుల మీదుగా ఆలయ అర్చకులకు, రుత్వికులకు యాగ వస్త్రాలను అందజేశారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవాచనం, షోడోష నాందీమాతృకాపూజ, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాసన తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజ చేసి యాగశాల ప్రవేశం గావించారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ ముఖమండపంలో స్వామివారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి తులసి ఆకులతో లక్షార్చన చేశారు. పూజా కార్యాక్రమాల అనంతరం రాత్రి 8గంటలకు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు జగదీష్‌ ప్రసాద్, తలారి రామలింగప్ప, వనగొంది విజయలక్ష్మి, మహేష్, సతీష్‌ గుప్త, గుడిపాటి ఆంజనేయులు, ఏఈవో మధు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement