వేసవిలో పాలమూరు జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు గూడూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు కర్ణాటక ప్రభుత్వం సోమవారం ఒక టీఎంసీ కృష్ణా జలాలను విడుదల చేయనుంది.
- ఒక టీఎంసీ విడుదల చేస్తామన్న కర్ణాటక మంత్రి పాటిల్
సాక్షి, హైదరాబాద్: వేసవిలో పాలమూరు జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ఎగువనున్న నారాయణపూర్ జలాశయం పరిధిలోని గూడూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు కర్ణాటక ప్రభుత్వం సోమవారం ఒక టీఎంసీ కృష్ణా జలాలను విడుదల చేయనుంది. ఈ మేరకు కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ శనివారం రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావుకు ఫోన్ చేశారు.
అలాగే ఆ రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి రాకేశ్సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం నారాయణపూర్ జలాశయం నుంచి నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలంటూ హరీశ్రావు ఇటీవల పలుమార్లు విజ్ఞప్తి చేయగా ఒక టీఎంసీ నీటి విడుదలకు బెంగళూరులోని కృష్ణా భాగ్య జల నిగమ్ అంగీకరించింది. తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వానికి మంత్రి హరీశ్ కృతజ్ఞతలు తెలిపారు.