జిల్లావ్యాప్తంగా కార్డుదారులకు జనవరి 1వతేదీ నుంచి సంక్రాంతి కానుక పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఆదేశించారు.
అనంతపురం అర్బన్ : జిల్లావ్యాప్తంగా కార్డుదారులకు జనవరి 1వతేదీ నుంచి సంక్రాంతి కానుక పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఆదేశించారు. ఆయన గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి తహశీల్దార్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీలర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో 11.24 లక్షల బీపీఎల్ కార్డులున్నాయన్నారు. ఇప్పటికే క్రిస్మస్ కానుక కింద 22,189 మందికి పంపిణీ జరిగిందన్నారు. సంక్రాంతి కానుక కింద మిగిలిన 11 లక్షల కార్డులకు పంపిణీ చేయాలన్నారు. ఈ నెల 31లోగా చౌక దుకాణాలకు కానుకలు తప్పక చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. పంపిణీలో అవతవకలకు తావివ్వకుండా సక్రమంగా జరిగేలా చూడాలన్నారు.
బాగాలేకపోతే వెనక్కి తీసుకోండి
కానుక కింద ఇస్తున్న కందిపప్పు, శనగపçప్పు, బెల్లం, గోధుమ పిండి, నెయ్యి ఇస్తున్నామన్నారు. జిల్లా 11 లక్షల కానుకలకు అదనంగా 10 శాతం కానుకలను ముందస్తుగా నిల్వ చేశామన్నారు. కార్డుదారు పొందిన సరుకుల్లో ఏదైనా వస్తువు నాణ్యతగా లేదని వస్తే డీలర్లు వారిని వెనక్కి పంపకూడదన్నారు. ఆ వస్తువుని తీసుకుని వేరొకటి ఇవ్వాలన్నారు. వాటిని డీలర్లు పౌర సరఫరాల శాఖకు పంపి మార్చుకోవాలని ఆదేశించారు. జనవరి 12లోగా ప్రతి కార్డుదారునికి కానుక అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.