ల్యాబ్‌లలో బూజు దులపాల్సిందే..! | Sakshi
Sakshi News home page

ల్యాబ్‌లలో బూజు దులపాల్సిందే..!

Published Tue, Jul 5 2016 8:29 AM

Inter practicals in Jambling process

* జంబ్లింగ్‌లోనే ఇంటర్ ప్రాక్టికల్స్
* ఇప్పటికే స్పష్టంచేసిన రాష్ట్ర సర్కారు
* జిల్లాలో 61 ప్రాక్టికల్స్ కేంద్రాల కేటాయింపు!

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు వారం రోజుల ముందుగా ల్యాబ్‌లను తెరచే సంస్కృతికి ఈ ఏడాది చరమగీతం పడనుంది. ప్రాక్టికల్స్ ల్యాబ్‌లలో బూజు దులిపే సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపధ్యంలో మూడు రోజుల కిందట అన్ని జిల్లాల ఆర్‌ఐవోలు, సిబ్బందితో సమీక్షించి జంబ్లింగ్ పద్దతిపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు. ఈ నేపధ్యంలో మంగళవారం జిల్లాలోన్ని అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు నిర్వహించనున్న కీలక సమావేశంపై ఆసక్తి నెలకొంది.   

2017 ఫిబ్రవరి మొదటి వారం నుంచి నెలాఖరు వరకు జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలను ఇప్పటి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేయాలని, కళాశాలలను తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులు స్పష్టంచేసినట్టు జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు చెబుతున్నారు.
 
జిల్లాలో 17 వేల మంది..
జిల్లాలో 43 ప్రభుత్వ, 11 సాంఘిక, 4 గిరిజన సంక్షేమ, 14 మోడల్, 90కు పైగా ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇందులో ద్వితీయ సంవత్సరం నుంచి సుమారు 17వేల మంది వరకు సైన్స్ విద్యార్థులు పాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. 61 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో 37 సర్కారీ కళాశాలలు ఉన్నట్టు తెలిసింది.
 
నేడు ప్రిన్సిపాళ్లతో సమావేశం
ఇదిలా ఉండగా జిల్లాలోని అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా ఆర్‌ఐఓ పాపారావు వెల్లడించారు. శ్రీకాకుళం బాలుర జూనియర్ కళాశాలలో జరగనున్న ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ విధిగా హాజరుకావాలని సూచించారు.

Advertisement
Advertisement