కట్టుకున్నోడే..కడతేర్చాడు

కట్టుకున్నోడే..కడతేర్చాడు - Sakshi


అనుమానమే పెనుభూతమై..

భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త

ఆపై తానూ గొంతుకోసుకున్న వైనం

కువైట్‌ నుంచి వచ్చిన నెలకే సంఘటన

అత్తగారి ఊరు వేములవాడలో దారుణం

నర్సింగాపూర్‌లో విషాదం




జగిత్యాలక్రైం/వేములవాడ : అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెళ్లిచేసుకుని.. కలకాలం కలిసి ఉంటానని బాస చేసిన భర్తే.. ఆమెను కానరాని లోకాలకు పంపాడు. పండగ కోసం భార్యను పుట్టింటికి తీసుకెళ్తున్నట్లు నటించి.. కత్తితో గొంతుకోసి అతిదారుణంగా హత్యచేశాడు. అనంతరం తానూ గొంతుకోసుకున్నాడు. ఈ సంఘటన వేములవాడ పట్టణంలో జరగగా.. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్‌లో విషాదం నింపింది. సంఘటనకు సంబంధించిన వివరాలు బంధువులు, పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం..



జగిత్యాల మండలం నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన నేరెళ్ల రవి గతంలోనే ధరూర్‌ గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆరేళ్లక్రితం వేములవాడ పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన చింతల్‌తాడెం నర్సయ్య, నర్సవ్వ దంపతుల కూతు రు వసంతను వివాహం చేసుకున్నాడు. వారికి రితిక్, సాయి, హర్షిత ముగ్గురు పిల్లలు సం తానం కలిగారు. రవి జీవనోపాధి కోసం మూ డేళ్లక్రితం కువైట్‌ వెళ్లాడు. నెలక్రితమే స్వగ్రామానికి వచ్చాడు. అప్పటినుంచే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా భార్యను వదిలించుకునేందుకు పథకం వేస్తున్నాడు.



ఉలిక్కిపడిన ఉప్పుగడ్డ వీధి

పండుగపూట.. అదీ నడీరోడ్డుపై అత్యంతపాశవికంగా గొంతుకోసి హత్య చేసిన ఘటనతో ఉప్పుగడ్డ వీధి ఉలిక్కిపడింది. ఎక్కడివారో తెలియదు.. ఎందుకు గొంతుకొస్తున్నాడో తెలియదు.. ఎటు చూసినా రక్తమే.. ఆ దృశ్యాలను చూసిన కాలనీవాసులు భయంతో వణికిపోయారు. పోలీసులకు సమాచారం అందిస్తూనే.. అప్పటికే ఏడుస్తున్న ముగ్గురు చిన్నారులను అక్కున చేర్చుకున్నారు. వసంత కన్నుమూయగా.. అపస్మారక స్థితికి చేరుకున్న రవిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.



పండక్కి తీసుకురమ్మంటే.. పైకి పంపాడు

‘పెత్రామాస పండుగుంది. పెద్దోళ్లకు బియ్యం ఇచ్చుకుంటం. బిడ్డ, పిల్లలను తీసుకునిరా అల్లుడు..’ అని వసంత తల్లి దండ్రులు రవికి కబురు పంపారు. అప్పటికే వసంతను ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తున్న రవికి ఇది మంచి అదునుగా కనిపించింది. భార్యాపిల్లలతో కలిసి బస్సులో అత్తగారి ఊరైన వేములవాడ చేరుకున్నాడు. అనంత రం ఓ ఆటోను కిరాయి మాట్లాడుకుని సుభాష్‌నగర్‌ బయల్దేరారు. భార్యాపిల్లలతో కలసి వెనుకసీట్లోనే కూర్చున్నాడు. ఉప్పుగడ్డవీధికి చేరుకోగానే.. బ్యాగులోంచి కత్తితీసి వసంత మెడను దారుణంగా కోశాడు. ఆటో డ్రైవర్‌ పై రక్తం పడడంతో వెనక్కి చూసేలోపే.. అతి కిరాతంగా కోసి.. ఆటోలోంచి బయటకు తోశాడు. మెడ తెగిపోవడంతో వసంత (32) అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం రవి (38) కూడా గొంతుకోసుకుని భార్యపక్కనే పడిపోయాడు.



మానవత్వం చాటుకున్న కాలనీవాసులు  

పండుగపూట అందరూ తమ పెద్దలకు బియ్యం ఇచ్చుకుని ఎంగిలిపూల బతుకమ్మ ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా ఉప్పుగడ్డ వీధిలో హాహాకారా లు.. పోలీసుజీపు హారన్స్‌తో దద్దరిల్లింది. కుటుంబ కలహాలతో భార్యను నడిరోడ్డుపై గొంతుకోసి హత్యచేయడంతో ఆరోడ్డంతా రక్తసిక్తమైంది. మిట్టమద్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఆ కాలనీవాసులు తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. భార్య శవం పక్కనే పడుకుని అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఘటన చూసిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఆందోళనకు గురైన ముగ్గురు పసిపిల్లలను చేరదీసి వారిలోని మానవత్వాన్ని చాటుకున్నారు.



చికిత్స పొందుతున్న రవి

కరీంనగర్‌ హెల్త్‌: భార్యను గొంతుకోసి హత్యచేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రవికి నగరంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చికిత్సఅందిస్తున్నారు. తీవ్ర రక్తస్రావం అయి విషమ పరిస్థితికి చేరడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాల్సి ఉందని, బాధితుడి తరఫు బంధువులు ఎవరూ రాలేదని వైద్యులు పేర్కొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top