అడుగడుగునా నీరాజనం | gudivada amarnath fight for Visakhapatnam Railway Zone | Sakshi
Sakshi News home page

అడుగడుగునా నీరాజనం

Apr 5 2017 1:15 AM | Updated on May 29 2018 4:37 PM

అడుగడుగునా నీరాజనం - Sakshi

అడుగడుగునా నీరాజనం

రైల్వేజోన్‌ సాధన కోసం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర

ఆత్మగౌరవ యాత్రకు బ్రహ్మరథం 
నగరంలో అనూహ్యస్పందన
అమర్‌కు మంగళహారతులు      
వామపక్షాల సంఘీభావం


విశాఖపట్నం : రైల్వేజోన్‌ సాధన కోసం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ చేపట్టిన ఆత్మగౌరవ యాత్రకు పార్టీలకతీతంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. సింహాచలంలోని స్వామి వారి కల్యాణమండపం నుంచి మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఆరో రోజు పాదయాత్ర ప్రారంభించిన అమర్‌ తొలుత గోశాల మీదుగా తొలి పావంచ వద్దకు చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరిగి గోశాల నుంచి శ్రీనివాసనగర్, ప్రహ్లాదపురం, విరాట్‌నగర్‌ మీదుగా గోపాలపట్నం పెట్రోల్‌ బంక్‌ జంక్షన్‌కు చేరుకున్న పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడ నుంచి గోపాలపట్నం మెయిన్‌రోడ్డు, బాజీ జంక్షన్, బుచ్చిరాజుపాలెం మీదుగా ఎన్‌ఎడీ జంక్షన్‌కు పాదయాత్ర చేరుకుంది. అక్కడ వైఎస్సార్, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అక్కడ నుంచి జాతీయ రహదారిపై మర్రిపాలెం వుడా లేవుట్‌ వరకు పాదయాత్ర సాగింది. అక్కడ భోజన విరామ సమయంలో పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ యాత్రకు సంఘీభావం తెలిపారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు మర్రిపాలెం లేఅవుట్‌ నుంచి అమర్‌ పాదయాత్ర ప్రారంభించారు. బీపీసీఎల్‌–పెట్రోల్‌ బంక్, బీఆర్‌టీఎస్‌ రోడ్డు, బంగారమ్మ గుడి, కేఎస్‌ఆర్‌ కాంప్లెక్స్, మాధవధార మెయిన్‌రోడ్, మురళీనగర్‌ జంక్షన్‌ వద్ద వామపక్ష నేతలు సుధాకర్, రాంగోపాల్, సనపల ఆంజనేయులు, అమ్మలమ్మ, బొడ్డేపల్లి పాపా రావు తదితరులు సంఘీభావం తెలిపారు. తిరిగి ప్రారం¿¶భమైన పాదయాత్ర మురళీనగర్‌ మెయిన్‌రోడ్, కప్పరాడ కొండ, బర్మాకాలనీ, ఐటీఐల మీదుగా ఊర్వశి జంక్షన్‌కు చేరుకుంది.

అక్కడ నుంచి కంచరపాలెం, రైల్వే క్వార్టర్స్, తాటిచెట్లపాలెం మీదుగా రాత్రి 8 గంటలకు 80 అడుగుల రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకోవడంతో ఆరో రోజు పాదయాత్ర ముగిసింది. మంగళవారం 18.70 కిలోమీటర్ల మేర అమర్‌ పాదయాత్ర చేయగా.. ఇప్పటివరకు 84.10 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. పాదయాత్ర సాగిన దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా మహిళలు ఎదురేగి స్వాగతం పలుకుతూ మంగళ హారతులు పట్టారు.

పలు చోట్ల అమర్‌పై పూల వర్షం కురిపించారు. పాదయాత్రలో ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, గిడ్డి ఈశ్వరి, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్రాధ్యక్షుడు మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కర్రి సీతారాం, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు కోలా గురువులు, పెట్ల ఉమాశంకర గణేష్, అదీప్‌రాజు, బొడ్డేడ ప్రసాద్, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కంపా హనోక్, రొంగలి జగన్నాథం, జాన్‌వెస్లీ, పార్టీ నేతలు కొయ్య ప్రసాదరెడ్డి, రవిరెడ్డి, పక్కి దివాకర్, సుంకరగిరిబాబు, కొండా రాజీవ్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ సత్తి రామకృష్ణారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖరయాదవ్, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ సుంకర గిరిబాబు, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్‌రాజు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పామేటి బాబ్జీ, బి.శ్యామ్‌కుమార్, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి బి.ఎల్‌.కాంతారావు, నగర ప్రధాన కార్యదర్శి సేనాపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఈ ఉద్యమం నా కోసం కాదు..
భావితరాల భవిష్యత్‌ కోసమే ఈ ఉద్యమం. శారదా నది తీరంలో మొదలైన ఈ ఆత్మగౌరవ యాత్ర గోస ్తని నది తీరం వరకు కొనసాగుతుంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని మాత్రమే కోరుతున్నాం. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు రైల్వేజోన్‌పై తమ అధిష్టానాలపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్మనకుండా ఉండడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది.
– గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

బాబు నిప్పు కాదు.. ఉప్పు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడితే తాను నిజాయితీపరుడినని గొప్పలు చెప్పుకుంటారు. ఆయన నిప్పు కాదు.. ఉప్పు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఓట్లు సంపాదించి ఎమ్మెల్యేలైనవారు చంద్రబాబు ప్రలోభాల కు.. ఆయన ఇచ్చిన నోట్ల కట్టలకు దాసోహమై పార్టీ ఫిరాయించారు. వారికి మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. బాబు వస్తే జాబన్నారు. కొడుకు లోకేష్‌కు మాత్రమే మంత్రి పదవి వచ్చింది. గిరిజనులకు కేబినెట్‌లో చోటు కల్పించకపోవడం చూస్తుంటే వారి పట్ల ఆయనకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్ధమవుతోంది.       – గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే

రైల్వేజోన్‌ కోసం అలుపెరగని ఉద్యమం
రైల్వేజోన్‌ కోసం గడిచిన మూడేళ్లుగా ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ మా త్రమే. అమర్‌నాథ్‌ ప్రా ణాలను సైతం లెక్కచేయకుండా గతేడాది ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ ఏడాది మండుటెండలో పాదయాత్ర చేస్తున్నారు.
– బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే

Advertisement
 
Advertisement
Advertisement