కాంట్రాక్టు సేద్యంలో పెట్టుబడులు పెట్టండి | Get invest in contract farming | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు సేద్యంలో పెట్టుబడులు పెట్టండి

Nov 7 2015 3:33 AM | Updated on Jun 4 2019 5:04 PM

కాంట్రాక్టు సేద్యంలో పెట్టుబడులు పెట్టండి - Sakshi

కాంట్రాక్టు సేద్యంలో పెట్టుబడులు పెట్టండి

రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవసాయానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేసింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవసాయానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు’ అంశంపై జరిగిన చర్చలో రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి పాల్గొన్నారు. సదస్సులో ప్రస్తావించిన అంశాలను ఆయన శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు కాంట్రాక్టు వ్యవసాయంలో పాలుపంచుకుంటున్నాయని... ఈ పద్ధతిలో వ్యవసాయం చేయడంవల్ల రైతులకు మరింత ప్ర యోజనం కలుగుతుందని పార్థసారథి చెప్పారు.

సంబంధిత కంపెనీయే రైతులకు విత్తనాలు అందించడంతోపాటు సాంకేతిక సహకారం, అడ్వాన్సు సొమ్ము చెల్లిస్తుందన్నారు. అందులో పండిన పంటను బైబ్యాక్ ఒప్పం దం ప్రకారం కంపెనీయే రైతులకు సొమ్ము చెల్లిస్తుందన్నారు. ఇప్పటికే ఐటీసీ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవసాయం చేస్తున్న విషయాన్ని ఆయన సదస్సులో ప్రస్తావించారు. నిజామాబాద్‌లో స్పైస్ పార్కు ఏర్పాటు చేస్తున్నందున పసుపునకు సంబంధించి ఆహార, చర్మ సౌందర్య పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశం కలుగుతుందని పార్థసారథి వివరించారు. అలాగే వరంగల్ జిల్లాలో పండిస్తున్న ఒక ప్రత్యేకమైన మిరప పంట ద్వారా రకరకాల రసాయనాలు ఉత్పత్తి చేయవచ్చని...వాటిని ఔషధాలు, ప్లేవర్స్‌లలోనూ వాడొచ్చన్నారు.

అందులోనూ పెట్టుబడులు పెట్టవచ్చని పారిశ్రామికవేత్తలకు ఆయన సూచించారు. నల్లగొండ జిల్లాలో బత్తాయి సాగు జరుగుతున్నందున అక్కడ పల్ప్ జ్యూస్ పరిశ్రమల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయన్నారు. గ్రీన్‌హౌస్‌పై ప్రభుత్వం కంపెనీలకు తలుపులు తెరిచి ఉంచినా స్పందన కరువైందని పార్థసారథి పేర్కొన్నారు. రాయితీ కోసం రూ. 250 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నా కంపెనీలు ముందుకు రాలేదని...దీనిపై కంపెనీలు దృష్టిసారించాలన్నారు. తృణధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటిని వ్యవసాయ వర్సిటీ ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నాయని... ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

హోంసైన్స్ కాలేజీలో సహజ రంగులు తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉందన్నారు. రాష్ట్రంలో అగ్రి బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏడాది తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉండదని స్పష్టం చేసిన ఆయన... మూడు, నాలుగేళ్ల తర్వాత సాగునీటి సమస్య కూడా పరిష్కారమవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement