అప్పుల బాధతో ఆగిన గుండె | farmer dies of heart attack | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో ఆగిన గుండె

Aug 19 2016 1:09 AM | Updated on Oct 1 2018 4:01 PM

కంబదూరు మండలం ఓంటారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు మారుతి (40) అప్పుల బాధ తాళలేక గుండెపోటుతో మృతిచెందాడు.

కంబదూరు: కంబదూరు మండలం ఓంటారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు మారుతి (40) అప్పుల బాధ తాళలేక గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన పంటలు సరిగా పండకపోవడంతో పొరుగు రాష్ట్రం బెంగళూరులో కూలీ పనులకు వెళ్లి గురువారం అక్కడే గుండెపోటుతో మృతిచెందాడు. బంధువులు అందించిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. ఓంటారెడ్డిపల్లికి చెందిన మారుతి కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవాడు. దీనికి తోడు  కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వేరుశనగ పంట సాగు చేసేవాడు.


అయితే పంటలు సాగు చేసినప్పుడెల్లా నష్టాలు రావడంతో అప్పులు పేరుకు పోయాయి. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక బెంగళూరుకు భార్య నాగమ్మతో కలిసి వలస వెళ్లాడు. అక్కడ బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేప«థ్యంలో గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి దాదాపు రూ.3 లక్షలకుపైగా అప్పులు ఉన్నాయి. ఆయనకు భార్య నాగమ్మతోపాటు, ఇద్దరు కుమారులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement