చెవి నరికారు.. మెడ కోశారు | cutting ear.. cutting neck | Sakshi
Sakshi News home page

చెవి నరికారు.. మెడ కోశారు

Sep 7 2016 10:54 PM | Updated on Sep 4 2017 12:33 PM

ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై దుండగులు తెగబడ్డారు. చెవి దుద్దుల కోసం ఆమె చెవిని కత్తితో కోసేశారు. ముక్కు పుడక కోసం ముక్కును కోస్తుండగా ఆమె పెదవులు తెగిపోయాయి. బంగారు గొలుసు కోసం మెడ నరికారు.

జీలుగుమిల్లి: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై దుండగులు తెగబడ్డారు. చెవి దుద్దుల కోసం ఆమె చెవిని కత్తితో కోసేశారు. ముక్కు పుడక కోసం ముక్కును కోస్తుండగా ఆమె పెదవులు తెగిపోయాయి. బంగారు గొలుసు కోసం మెడ నరికారు.  జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములగలంపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల తొంట గంగా మహాలక్ష్మి ఒంటరిగా ఉంటోంది. ఆమె భర్త చాలాకాలం క్రితం మరణించాడు.
 
ఆమె కుమారుడు, కుమార్తె వివాహాలు కావడంతో వేరే గ్రామాల్లో ఉంటున్నారు. దీంతో మహాలక్ష్మి గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి తెగబడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో చెవి దుద్దుల కోసం ఆమె చెవిని, ముక్కు పుడక కోసం పెదవులను, గొలుసు కోసం మెడను కత్తితో కోసేశారు. చెవిదుద్దులు, ముక్కుపుడక రాకపోవడంతో ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. ఘటనలో వృద్ధురాలి చెయ్యి విరిగిపోయింది.
వృద్ధురాలు తేరుకుని నల్లజర్ల మండలం దూబచర్లలో ఉంటున్న కుమారుడికి ఫోన్‌ చేయడంతో అతడితోపాటు బంధువులు వచ్చి ఆమెను జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై పి.బాలసురేష్‌ తెలిపారు. దొంగల ఆచూకీ కోసం డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో తనిఖీలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement