ఫోర్జరీ సంతకాలతో బ్యాంకు రుణం | bank employee cheated farmers taking loan with Signatures Forgery | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ సంతకాలతో బ్యాంకు రుణం

Sep 19 2017 11:57 AM | Updated on Apr 4 2019 2:50 PM

తహసీల్దార్, వీఆర్‌ఓ, డీటీల సంతకాలు ఫోర్జరీ చేసి రుణం పొందిన సంఘటన మండలంలోని పెదబుడ్డిడి గ్రామంలో వెలుగుచూసింది.

తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు

విజయనగరం ,జియ్యమ్మవలస : తహసీల్దార్, వీఆర్‌ఓ, డీటీల సంతకాలు ఫోర్జరీ చేసి రుణం పొందిన సంఘటన మండలంలోని పెదబుడ్డిడి గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సీమల రమాదేవికి మూడెకరాల జిరాయితీ పొలం ఉంది. దీనిపై ఆమె (సర్వే నంబర్లు 259/9, 258/10, 264/1, 3, 271/4) రావివలస ఆంధ్రాబ్యాంక్‌ బ్రాంచిలో లక్ష  రూపాయల రుణం కూడా తీసుకుంది. అయితే  శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం విక్రమపురానికి చెందిన మాచర్ల అచ్యుతరావు నకిలీ కౌలుపత్రాలు సృష్టించి పల్లి కొండయ్య అనే వ్యక్తిని జామీనుగా చూపించి లక్ష రూపాయల రుణం తీసుకున్నారు.

వీరిద్దరు కూడా ఆంధ్రాబ్యాంక్‌ రావివలస బ్రాంచిలో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలు రమాదేవి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు సోమవారం వినతిపత్రం అందజేసింది. దీనిపై తహసీల్దార్‌ కేవీఎస్‌ భాస్కరరావు స్పందిస్తూ ఈ విషయమై విచారణ చేపడతామన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎంపీటీసీ సభ్యుడు బాబూ భువనమోహనరావు, గ్రామపెద్దలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement