వృద్దురాలి మెడలో ఐదు తులాల బంగారు చైనును చోరీ చేసిన ఘటన శుక్రవారం రాత్రి పుట్టపర్తి పట్టణంలో చోటు చేసుకుంది.
పుట్టపర్తి టౌన్ : వృద్దురాలి మెడలో ఐదు తులాల బంగారు చైనును చోరీ చేసిన ఘటన శుక్రవారం రాత్రి పుట్టపర్తి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. సత్యసాయి భక్తురాలైన పుష్ప మూడు దశాబ్దాల కిందట పుట్టపర్తికి వచ్చి స్థిరపడ్డారు.ప్రశాంతి నిలయంలో సేవ కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ పట్టణంలోని మాధవసాయి ఆపార్ట్మెంట్లో ఉంటోంది.
శుక్రవారం సాయంత్రం 8.45 గంటల సమయంలో ప్రశాంతి నిలయంలో సేవలు ముగించుకుని ఇంటికి వెళుతుండగా వెనుకనుంచి వచ్చిన ఆగంతకుడు ఒక చేత్తో ఆమె కళ్లను అదిమిపట్టుకుని, మరో చేత్తో మెడలోని ఐదుతులాల బంగారు చైన్ను లాక్కుని పారిపోయాడు.
ఆమె తేరుకుని చుట్టపక్కల వారిని పిలిచే లోపు దండగుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేష్ నాయక్ సంఘటనా స్థలాలను చేరుకుని వివరాలు ఆరా తీశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.