అనుమానంతో భార్యను హతమార్చిన భర్త  | Women Brutually Murdred By Her Husband In Kurnool | Sakshi
Sakshi News home page

భార్యను హతమార్చిన భర్త 

Jul 13 2019 11:31 AM | Updated on Jul 13 2019 11:31 AM

Women Brutually Murdred By Her Husband In Kurnool - Sakshi

సాక్షి, కొలిమిగుండ్ల(కర్నూలు) : వ్యసనాలకు బానిసైన భర్త కట్టుకున్న భార్యనే పట్టపగలు హతమార్చిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని కోర్నపల్లెలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కోర్నపల్లెకు చెందిన తలారి పుల్లన్న, పుల్లమ్మ కుమార్తె పార్వతి(35)కి అనంతపురం జిల్లా పెద్ద పప్పూరు మండలం సుంకేసులపల్లెకు చెందిన నారాయణతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. తాగుడుకు బానిసైన నారాయణ భార్యపై అనుమానం పెంచుకొని చిత్ర హింసులకు గురిచేస్తుండేవాడు.

దీంతో తల్లితండ్రులు తొమ్మిది నెలల క్రితం కూతురు, అల్లుడిని కోర్నపల్లెకు తీసుకొచ్చి ఇంటి పక్కన ఉన్న మరో ఇంటిటో నివాసం ఉంచారు. భార్యభర్తలిద్దరూ సున్నంబట్టిలో కూలీ పనికి వెళ్లేవారు. ఇటీవల నారాయణ పనికి వెళ్లడం మానేసి, మద్యం తాగుతూ జులాయిగా తిరిగే వాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి ముందు కూర్చొని కాఫీ తాగుతున్న భార్యపై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అదే సమయంలో ఇంటి ఆవరణలో మహిళ తండ్రి, మరొకరు ఉన్నా అడ్డుకోలేకపోయారు. క్షణాల్లో హత్య చేసి, కొడవలిని అక్కడే వదిలేసి పారిపోయాడు. కూతురు రక్తపు మడుగులో పడిపోవడంతో తండ్రి బోరున విలపించాడు.

తల్లి రెండు రోజుల క్రితం విహార యాత్రలో భాగంగా మధురై వెళ్లింది. విషయం తెలుసుకున్న కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు గ్రామానికి చేరుకొని పార్వతి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరుతెన్నులను ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. పారిపోయిన నిందితుడిని ఎస్‌ చెన్నంపల్లె–తిమ్మనాయినపేట చెరువు మధ్య గ్రామస్తుల సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement