సాగర్‌ కాలువలో ఇద్దరి గల్లంతు | Two young people missed in Sagar Canal | Sakshi
Sakshi News home page

సాగర్‌ కాలువలో ఇద్దరి గల్లంతు

Mar 16 2018 9:38 AM | Updated on Aug 1 2018 2:31 PM

Two young people missed in Sagar Canal - Sakshi

విద్యార్థుల కోసం సాగర్‌లో గాలిస్తున్న దృశ్యం..ఇన్‌సెట్లో విద్యార్థుల ఫైల్‌ ఫోటోలు

వర్ని(బాన్సువాడ): ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి.. చదువుల ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఐదుగురు స్నేహితులు నిజాంసాగర్‌ కాలువలో సరదాగా ఈతకు వెళ్లారు. అయితే, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు గల్లంతయ్యారు. వర్ని మండల కేంద్రానికి చెందిన ఇంటర్‌ విద్యార్థులు సోహెల్‌ (17), ప్రభురాజ్‌ (17) బుధవారం చివరి పరీక్ష రాశారు. పుస్తకాలతో కుస్తీ పట్టి అలసిపోయిన ఆ మిత్రులు ఇద్దరు సహా ఐదుగురు స్నేహితులు గురువారం సరదాగా స్నానం చేయడానికి సత్యనారాయణ పురం సమీపంలో గల నిజాంసాగర్‌ కాలువలోకి దిగారు.

కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో సోహెల్, ప్రభురాజ్‌ కొట్టుకుపోయారు. వీరిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తోటి స్నేహితులతో పాటు సమాచారమందుకున్న బంధువులు కాలువ వెంబడి సాయంత్రం వరకు గాలించారు. రబీ పంటల కోసం వారం రోజులుగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏడు అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం ఉంటుందని స్థానికులు తెలిపారు. విద్యార్థులు గల్లంతు కావడంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement